ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్య ఐదేళ్లు అధికారంలో ఉండగా జగన్ సర్కారు సాధించిన గొప్ప విజయాల్లో ఒకటిగా వైసీపీ వాళ్లు చెప్పుకునే అంశం.. మెడికల్ కాలేజీల నిర్మాణం. జగన్ 17 మెడికల్ కాలేజీలు నిర్మించాడని వైసీపీ వాళ్లు ఘనంగా చెప్పుకుంటూ ఉంటారు. ఐతే అందులో నాలుగైదుకు మించి కాలేజీల నిర్మాణం జరగలేదు. పూర్తయిన కాలేజీలు కూడా పూర్తి స్థాయిలో పని చేయట్లేదన్నది గ్రౌండ్ రిపోర్ట్. ఈ కాలేజీల నిర్మాణానికి కేంద్ర కూడా నిధులు అందిస్తోంది. కానీ జగన్ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున తక్కువ మొత్తంలో నిధులు ఖర్చు చేశారు.
చాలా చోట్ల భూముల కేటాయింపు మాత్రమే జరిగింది. నిర్మాణ పనులే మొదలు కాలేదు. కొన్ని చోట్ల పునాదులు పడ్డాయి. అంతకుమించి ఏమీ జరగలేదు. ఐతే వైసీపీ వాళ్లు మాత్రం జగన్ 17 మెడికల్ కాలేజీలు కట్టాడని పదే పదే వల్లె వేస్తుంటారు. బుధవారం నాటి ప్రెస్ మీట్లో విలేకరులు జగన్ వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించారు. చాలా కాలేజీల నిర్మాణం పూర్తి కాలేదు కదా అడిగితే జగన్ దాన్ని సమర్థిస్తూ సమాధానం ఇచ్చారు.
ఏ భవన నిర్మాణం అయినా ఒక్క రోజులో పూర్తి కాదని.. కొన్నేళ్ల సమయం పడుతుందని జగన్ అన్నారు. మంగళగిరిలో ప్రతిష్టాత్మక ఎయిమ్స్ నిర్మాణానికి తొమ్మిదేళ్లు పట్టిందని.. అలాంటపుడు రాష్ట్రంలో కూడా మెడికల్ కాలేజీలు కట్టడానికి సమయం పడుతుంది కదా అని జగన్ ప్రశ్నించారు. ఐతే ఎయిమ్స్ ఎంత భారీ భవన సముదాయం అన్నది తెలియంది కాదు. పైగా దశాబ్దాల కిందట టెక్నాలజీ అందుబాటులో లేనపుడు దాని నిర్మాణం జరిగింది. దానికి ప్రస్తుత పరిస్థితులతో పోలిక పెట్టడం విడ్డూరం. ఆ సంగతి పక్కన పెడితే.. మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఐదేళ్లు సరిపోవని.. ఇంకా సమయం పడుతుందని వాదిస్తున్న జగన్.. రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో లేవనెత్తిన అభ్యంతరాలు ప్రస్తావనార్హం.
జగన్ సహా వైసీపీ వాళ్లందరూ.. 2015లో అమరావతి రాజధానిగా ఖరారయ్యాక తర్వాతి నాలుగేళ్లలో రాజధాని పూర్తి కాలేదంటూ నానా యాగీ చేశారు. 40 వేల కోట్లకు పైగా డబ్బులు ఖర్చు పెట్టి పదుల సంఖ్యలో భారీ భవనాలు 80-90 శాతం పూర్తి చేస్తే.. అమరావతిలో గ్రాఫిక్స్ తప్ప ఏమీ లేవని ఎద్దేవా చేశారు. కొన్ని కాలేజీల నిర్మాణానికి ఐదేళ్లు సరిపోనపుడు.. ఒక రాష్ట్ర రాజధాని నాలుగేళ్లలో అవ్వలేదని విమర్శలు చేయడంలో లాజిక్ ఎక్కడుంది?
Gulte Telugu Telugu Political and Movie News Updates