కేసీఆర్ ఆశ‌యం కోసం కొట్లాడుతా: క‌విత‌

సామాజిక తెలంగాణ కోసం కొట్లాడుతాన‌ని బీఆర్ఎస్ నుంచి స‌స్పెండ్ అయిన‌.. ఆ పార్టీకి రాజీనామా చేసిన జాగృతి అధ్య‌క్షురాలు క‌విత తెలిపారు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. సామాజిక తెలంగాణ సాధించేందుకు తెలంగాణ జాగృతి ప‌క్షాన పోరాడుతామ‌న్నారు. కేసీఆర్ ఆశ‌యాల‌ను సాధించేందుకు ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్తామ‌ని తెలిపారు. “కేసీఆర్ క‌ష్ట‌కాలంలో ఉంటే.. పోరాడేందుకు ముందుకు వ‌చ్చింది మేమే. మా జాగృతి కార్య‌కర్త‌లే” అని క‌విత కీల‌క వ్యాఖ్యలు చేశారు. “సామాజిక తెలంగాణ సాధనే ధ్యేయం. ఒక ‘మహిళ’ అనుకుంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన వీర వనిత చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగుతాం.” అని క‌విత వ్యాఖ్యానించారు.

“నిన్న మొన్నటి వరకు కాళేశ్వరం కూలిపోయిందని సీఎం అన్నాడు నిన్న మాత్రం అదే ప్రాజెక్ట్ లో భాగమైన మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తెచ్చే ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేశారు. కొండపోచమ్మ సాగర్ నుంచి హైదరాబాద్ కు నీళ్లు తెస్తే 1500 కోట్లు మాత్రమే ఖర్చు అవుతాయి. 1500 కోట్లతో హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చవచ్చు. కానీ, మల్లన్న సాగర్ నుంచి నీళ్లు తెస్తామంటూ రూ.7,500 కోట్లు ఖర్చు చేస్తున్నారు. మేఘా కృష్ణారెడ్డి మరిన్ని మేడలు కట్టేందుకు రేవంత్ సహకరిస్తున్నారు. 1500 కోట్ల ప్రాజెక్ట్… 7500 కోట్లకు ఎందుకు చేరిందో చెప్పాలి.” అని క‌విత డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రజల సొమ్ము రేవంత్ రెడ్డి ఇంటి సొమ్ము కాద‌ని క‌విత విమ‌ర్శించారు. తెలంగాణ జాగృతి ఉన్నతమైన లక్ష్యంతో ముందు అడుగు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. సామాజిక తెలంగాణ సాధించే వరకు జాగృతి విశ్రమించదని పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ కోసం ‘లెప్ట్ టు రైట్’ అందరినీ కలుస్తామ‌ని క‌విత చెప్పారు. అన్ని వర్గాల వారి అభిప్రాయాలను తీసుకుంటామ‌న్నారు. తెలంగాణ సమాజాన్ని మరింత పటిష్టం చేసే విధంగా కృషి చేస్తామ‌ని వ్యాఖ్యానించారు. మూడో సారి కూడా గెలిస్తే కేసీఆర్ సామాజిక తెలంగాణ సాధించేవార‌ని క‌విత చెప్పుకొచ్చారు. అయితే.. కేసీఆర్ అజెండాను తాము ముందుకు తీసుకెళ్తామ‌ని తెలిపారు.

అందరికీ అవకాశాలు ఉండే సమాజాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తామ‌ని చెప్పారు. తెలంగాణ కోసం కేసీఆర్ ఎంచుకున్న మార్గాన్నేసామాజిక తెలంగాణ కోసం మేము ఎంచుకుంటామ‌ని క‌విత వ్యాఖ్యానించారు. అయితే.. ఈ సంద‌ర్భంగా మీడియా అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌ను ఆమె దాట వేశారు. ఇదేస‌మ‌యంలో కేటీఆర్ పైనా.. హ‌రీష్ రావు పైనా ఎలాంటి వ్యాఖ్య‌లు చేయ‌లేదు. అంతేకాదు.. త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌ను కూడా వెల్ల‌డించ‌లేదు. “మీరే చూస్తారు” అని ముక్త‌స‌రి స‌మాధానంతో క‌విత స‌రిపుచ్చారు. గ‌తానికి భిన్నంగా ఆమె వ్య‌వ‌హ‌రించ‌డం.. వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.