మ‌ద్యం స్కామ్‌లో సంచ‌ల‌నం.. ‘వారంద‌రికీ’ బెయిల్‌!

ఏపీలో వైసీపీ హ‌యాంలో జ‌రిగిన‌ట్టుగా ప్ర‌భుత్వం చెబుతున్న లిక్క‌ర్ కుంభ‌కోణంలో తాజాగా సంచ‌ల‌నం చోటు చేసుకుంది. ఈ స్కామ్‌లో మొత్తం 3500 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు చేతులు మారాయ‌ని, దారి మ‌ళ్లాయ‌ని, విదేశాల‌కు సైతం పంపించార‌ని ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం(సిట్‌) అధికారులు చెబుతున్నారు.ఈ క్ర‌మంలోనే 14 మందిని అరెస్టు చేశారు. వీరంతా హైప్రొఫైల్ ఉన్న‌వారే కావ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, తాజా ప‌రిణామాల‌తో ఈ కేసు దాదాపు యూట‌ర్న్ తీసుకుందన్న చ‌ర్చ సాగుతోంది. స‌రైన సాక్ష్యాలు లేవ‌న్న కార‌ణంతో ముగ్గురు కీలక నిందితులు(సిట్ పేర్కొన్న మేర‌కు) తాజాగా బెయిల్ మంజూరైంది.

వీరిలో మాజీ ఐఏఎస్ అధికారి ధ‌నుంజ‌య్‌రెడ్డి, జ‌గ‌న్ ద‌గ్గ‌ర గ‌తంలో ఓఎస్‌డీగా ప‌నిచేసిన కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, భారతీ సిమెంట్స్ లో ఆడిట‌ర్‌గా ప‌నిచేస్తున్న బాలాజీ గోవింద‌ప్ప‌ల‌కు విజ‌య‌వాడ‌లోని ఏసీబీ కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. వీరంతా మే 13 నుంచి జైల్లోనే ఉన్నారు. దీనికి ముందే వారు .. కోర్టును ఆశ్ర‌యించి ముంద‌స్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నించినా.. అప్ప‌ట్లో స‌క్సెస్ కాలేదు. తాజాగా గ‌త నెల‌లో సిట్ దాఖ‌లు చేసిన చార్జ్ షీట్‌లో స‌రైన వివ‌రాలు లేవ‌ని, లోపాలు ఉన్నాయ‌ని ఏసీబీ కోర్టు స్ప‌ష్టం చేసింది. దీంతో ఇటీవ‌ల రివైజ్డ్ చార్జ్ షీట్‌ను దాఖలు చేశారు. దీనిలోనూ లోపాలు ఉన్నాయ‌ని కోర్టు తాజాగా వెల్ల‌డించింది.

ఈ క్ర‌మంలోనే నిందితులుగా ఉన్న ధ‌నుంజ‌య్‌రెడ్డి, కృష్ణ‌మోహ‌న్‌రెడ్డి, బాలాజీ గోవింద‌ప్ప‌ల‌కు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువ రించింది. కాగా.. ఇది మ‌ధ్యంత‌ర బెయిల్ కాక‌పోవ‌డం గ‌మ‌నార్హం. శ‌నివారం నాటి విచార‌ణ సంద‌ర్భంగా నిందితుల‌పై స‌రైన సాక్ష్యాలు, ఆధారాలు సేక‌రించ‌లేద‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. ఈ క్ర‌మంలోనే వారికి బెయిల్ ఇస్తున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది. ఇక‌, ఒక్క విదేశాల‌కు వెళ్ల‌కూడ‌ద‌న్న నిబంధ‌న‌లు త‌ప్ప వారికి ఎలాంటి ష‌ర‌తులు విధించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో పై ముగ్గురు సోమ‌వారం లేదా ఆదివారం విజ‌య‌వాడ జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

మ‌రోవైపు.. ఎంపీ మిథున్ రెడ్డికి కూడా ఏసీబీ కోర్టు బెయిల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అయితే.. ఆయ‌న‌కు ప‌లు ష‌ర‌తులు విధించింది. ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నికల్లో ఓటు వేసేందుకు మాత్ర‌మే బెయిల్ ఇచ్చిన‌ట్టు స్ప‌ష్టం చేసింది. కాగా.. ఒకే రోజు ఇలా న‌లుగురు కీల‌క నిందితుల‌కు బెయిల్ రావ‌డంతో ఈ కేసుపై చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు.. ఇప్ప‌టికే జైల్లో ఉన్న చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి పిటిష‌న్ కూడా సోమ‌వారం మ‌రోసారి విచార‌ణ‌కు రానుంది. ఇంత మందికి బెయిల్ ల‌భించిన నేప‌థ్యంలో 38వ నిందితుడిగా ఉన్న చెవిరెడ్డికి కూడా బెయిల్ వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేద‌ని.. న్యాయ‌వాదులు చెబుతున్నారు. మొత్తంగా ఈ కేసు ఎలాంటి మ‌లుపుతిరుగుతుంద‌న్న‌ది చూడాలి.