హరీష్ ను దూరం పెట్టేశారా ?

మంత్రి హరీష్ రావు పై దుబ్బాక ఉపఎన్నిక ప్రభావం బాగా పడినట్లుంది. మొన్ననే జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోయిన విషయం తెలిసిందే. నిజానికి అధికారపార్టీ అభ్యర్ధి ఓటమి చాలా అనూహ్యమనే చెప్పాలి. సరే ఊహించిందే అయినా అనూహ్యమైన ఓటమి ఓటమే అనటంలో సందేహం లేదు. ఎన్నికలో పార్టీని గెలిపించే బాధ్యత హరీష్ మీద పెట్టారు కేసీయార్. మొదట్లో ఉపఎన్నికను చాలా తేలిగ్గా తీసుకున్న కేసీయార్ కొద్ది రోజుల తర్వాత పూర్తిగా దృష్టిపెట్టారు.

ఇందులో భాగంగానే మంత్రి హరీష్ ను ఇన్చార్జిగా నియమించారు. దాంతో మంత్రి కూడా నూరుశాతం ఎఫర్టు పెట్టారు. రాత్రనక, పగలనక నియోజకవర్గంలోనే క్యాంపు వేసి ప్రచారం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. చివరకు 1179 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్ధి ఓడిపోయారు. తమ అభ్యర్ధి ఓటమికి తానే బాధ్యత తీసుకుంటున్నట్లు హరీష్ కూడా ప్రకటించేశారు. సరే అదంతా చరిత్రగా మిగిలిపోయిందిపుడు.

మరి తాజాగా మొదలైన గ్రేటర్ హదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల సమరంలో ఎక్కడ చూసినా కేసీయర్ కొడుకు, మంత్రి కేటీయారే కనబడుతున్నారు. డివిజన్లలో ప్రచారం చేసినా, పార్టీ తరపున తయారు చేసిన వాల్ పోస్టర్లు, అడ్వర్టైజ్మెంట్లలో లో కూడా ఎక్కడ చూసినా కేసీయార్, కేటీయార్ మాత్రమే కనబడుతున్నారు. డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్ధులు వేయించుకున్న పోస్టర్లలో కూడా ఎక్కువగా సీఎం, కేటీయార్ మొహాలు మాత్రమే కనబడుతున్నాయి. పోయిన ఎన్నికల్లో హరీష్ విపరీతంగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

అంటే హరీష్ ను పూర్తిగా పక్కన పెట్టేసినట్లే అర్ధమవుతోంది. నిజానికి హరీష్ ను పక్కన పెట్టేయాల్సిన అవసరమే లేదు. దుబ్బాకలో పార్టీ ఓడిపోయిందంటే అందుకు ప్రధాన కారణం కేసీయారే కానీ హరీష్ ఎంతమాత్రం కాదు. అలాంటిది ఇపుడు హరీష్ ను ఎందుకు దూరం పెట్టేవశారు. ఎందుకంటే కొడుకు కేటీయార్ కు మేనల్లుడు హరీష్ పోటీ వస్తారో అన్న భయంతోనే అని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పార్టీ నాయకత్వం విషయంలో కేటీయార్ కన్నా హరీషే గట్టి వాడనే ప్రచారం పార్టీలో ఎప్పటి నుండో జరుగుతోంది. అందుకనే మున్సిపల్ ఎన్నికల్లో హరీష్ ను దూరంగా పెట్టేసి కొడుకు కేటీయార్ ను మాత్రమే బాగా ఫోకస్ చేస్తున్నట్లు ప్రచారం పెరిగిపోతోంది. దుబ్బాకలో ఓడినందుకే హరీష్ ను పక్కన పెట్టేశారంటు చెప్పుకుంటున్నారు.