కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ అసెంబ్లీలో పెద్ద ఎత్తున వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే హరీష్రావుకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదేవిధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు.. హరీష్రావుకు మధ్య కూడా తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. సభలో అధికార పక్షం వివరణ ఇస్తుండగానే బీఆర్ ఎస్ పక్ష నాయకులు సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా వారికి ఇచ్చిన నివేదిక ప్రతులను చించేసి సభలో చిందర వందరగా జల్లారు. అనంతరం రాత్రి 10 గంటల సమయంలో, కేటీఆర్ హరీష్ రావు పార్టీ నేతలను వెంట బెట్టుకుని గన్ పార్క్ వరకు పాదయాత్రగా వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన భట్టి విక్రమార్కను కార్నర్ చేస్తూ.. తీవ్రస్థాయిలో హరీష్ రావు విమర్శలు గుప్పించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వాన్నికూడా లక్ష్యంగా చేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదన్న డిప్యూటీ సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు హరీష్ రావు తెలిపారు. కాళేశ్వరం ద్వారా 17 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామన్నారు. దీనిని తాము నిరూపిస్తామని.. భట్టివిక్రమార్క తన పదవికి రాజీనామా చేయాలని సవాల్ రువ్వారు. “కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్నవాళ్లు తెలంగాణకు పట్టిన శనేశ్వరులు“ అంటూ తనదైన శైలిలో హరీష్రావు వ్యాఖ్యానించారు.
ఒట్టిపోయిన పొలాలకు జలాలతో జీవం పోసిన కేసీఆర్పై కేసులు పెడతారా? అంటూ హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ సమాజం బాగుండాలని స్వప్నించిన హాలికుడిపై కత్తి కడతారా? అంటూ నిప్పులు చెరిగారు. రాష్ట్రం వచ్చాక 20 లక్షల ఎకరాల ను స్థిరీకరించినట్టు చెప్పారు. తాము ఆధారాలతో సహా మాట్లాడుతుంటే.. అధికార పక్షానికి కడుపు మంటగా మారిందని, దీంతో సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా నోరు నొక్కుతున్నారని ఆరోపించారు. వన్ సైడ్గానే చర్చ చేపట్టారని విమర్శిం చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయిందని.. అయినా ఒక్క కాలువ కూడా తవ్వించలేదన్నారు.
కేసీఆర్ ఏం చేశారో.. తెలంగాణ రైతాంగాన్ని అడగాలని ప్రభుత్వానికి హరీష్రావు సూచించారు. “రాష్ట్రాన్ని పచ్చని తోరణంగా మార్చడం కేసీఆర్ చేసిన తప్పా? రైతాంగానికి 24 గంటల పాటు కరెంటు ఇవ్వడం ఆయన చేసిన నేరమా? ఆయనపైనే కేసులు పెడతారా? అసలు కేసులు పెట్టాల్సింది కాంగ్రెస్పైనే“ అని హరీష్రావు నిప్పులు చెరిగారు. ప్రాజెక్టులు కట్టించినందుకు కేసీఆర్పై కేసులు పెట్టడం న్యాయమా? అని తెలంగాణ సమాజమే ప్రశ్నిస్తోందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. `మేడిగడ్డ.. తెలంగాణకు మేటిగడ్డ` అని వ్యాఖ్యానించారు. మేడిగడ్డలో కుంగిన పిల్లర్లను తక్షణమే రిపేర్లు చేయించాలన్నారు. దీనికి 300 నుంచి 400 కోట్లు ఖర్చవుతుందన్నారు. “అది పీసీ ఘోష్ రిపోర్టు కాదు.. గ్యాస్ రిపోర్ట్“ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates