హ‌రీష్‌రావు-కేటీఆర్ అరెస్టు.. హైద‌రాబాద్‌లో ఉద్రిక్త‌త‌

హైద‌రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితి ఏర్ప‌డింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ ఎస్ కీల‌క నాయ‌కులు, ఎ మ్మెల్యేలు.. హ‌రీష్‌రావు, కేటీఆర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు.. పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల అనుచ‌రుల‌ను కూడా అదుపులోకి తీసుకుని సెక్ర‌టేరియ‌ట్ ప‌రిధిలోని ఖైర‌తాబాద్ పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. దీంతో ప‌రిస్థితి తీవ్రంగా మారింది. కేటీఆర్‌-హ‌రీష్‌రావుల అరెస్టు వార్త‌తో తెలంగాణ భ‌వ‌న్ నుంచి పెద్ద ఎత్తున అనుచ‌రులు సెక్ర‌టేరియెట్‌కు బ‌య‌లు దేశారు. దీంతో వీరిని జూబ్లీహిల్స్ పోలీసులు అడ్డుకున్నారు.

అస‌లు ఏం జ‌రిగింది?

శ‌నివారం తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ స‌మ‌యంలో స‌భ‌కు ఇలా వెళ్లి అలా బ‌య‌ట‌కు వ‌చ్చిన కేటీఆర్‌.. రైతుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చ‌కు ప‌ట్టుబ‌ట్టారు. అయితే.. తొలిరోజు స‌భ‌లో సంతాప తీర్మానానికి మాత్ర‌మే ప‌రిమితం అయ్యారు. దీంతో సెక్ర‌టేరియ‌ట్‌కు చేరుకున్న హ‌రీష్‌, కేటీఆర్‌లు ఇద్ద‌రూ.. రైతుల స‌మ‌స్య‌ల‌పై ఆందోళ‌న‌కు దిగారు. త‌మ అనుచ‌రులు, పార్టీ నాయ‌కులు, కార్య‌కర్త‌ల‌తో క‌లిసి.. సెక్ర‌టేరియెట్ ముట్ట‌డికి పిలుపునిచ్చారు. ఈ క్ర‌మంలో మెరుపు ఆందోళ‌న‌తో ఉలిక్కిప‌డ్డ‌… పోలీసులు.. హుటాహుటిన వాహ‌నాలు తెప్పించి.. బీఆర్ ఎస్ నాయ‌కుల‌ను అరెస్టు చేశారు.

ఈ సంద‌ర్భంలో కేటీఆర్ పోలీసు వాహ‌నంలో నుంచే మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు గోస పెడుతున్నార‌ని, యూరియా దొర‌క్క ఆత్మ‌హ‌త్య‌లు చేసుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌న్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక‌.. రాష్ట్రంలో అన్న‌దాతలు అలోల‌క్ష్మ‌ణా అంటూ.. అల‌మ‌టిస్తున్నార‌ని విమ‌ర్శించారు. యూరియా కోసం రైతులు ప‌డిగాపులు ప‌డుతుంటే.. ఇక్క‌డ సీఎం, మంత్రులు వినోదం చూస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. యూరియా కొరతను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అయితే.. పోలీసులు రంగంలోకి దిగి.. నాయ‌కుల‌ను అదుపులోకి తీసుకుని.. స్టేష‌న్‌కు త‌ర‌లించారు. ఈస‌మ‌యంలోనూ బీఆర్ ఎస్ కార్య‌క‌ర్త‌లు పోలీసు వాహ‌నాల‌ను అడ్డుకునే ప్ర‌య‌త్నం చేశారు.