ఏపీ సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం ఇక నెంబర్ 1 స్థానంలోకి వెళ్తుందా? ఇక్కడ జరుగుతున్న అభివృద్ధికి తిరుగులేదా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. గత ఎన్నికల్లో చంద్రబాబు వరుసగా 7వ సారి విజయం సాధించిన తర్వాత ఇక్కడి పరిస్థితులు, పరిణామాలు కూడా మారుతున్నాయి. ఎన్నికలకు ముందు ఎలా ఉన్నా, ఇప్పుడు మాత్రం ఈ 15 మాసాల్లో నియోజకవర్గంలో సమూలమైన మార్పులు వచ్చాయి.
వైసీపీ చేసిన విమర్శలకు, ఇక్కడ పాగా వేయాలన్న ఆ పార్టీ వ్యూహాలకు చంద్రబాబు సహా ఆయన సతీమణి చెక్ పెట్టారు. గత ఎన్నికల సమయంలో నారా భువనేశ్వరి కూడా ఇక్కడ పర్యటించారు. సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు హామీ ఇచ్చారు. వరుస విజయాల అనంతరం చంద్రబాబు కీలకమైన సూర్యఘర్ పథకం ను తన నియోజకవర్గంలోనే ప్రారంభించారు. పలు మండలాల్లో పూర్తిగా సూర్యఘర్ ను అమల్లోకి తెచ్చి విద్యుత్ చార్జీల బెడద నుంచి ప్రజలను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఇంటికో ఆదాయ వనరును కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుని చేతివృత్తులను ప్రోత్సహిస్తున్నారు. కుట్టు మిషన్లతో పాటు కంప్యూటర్లను కూడా రుణాలపై ఇప్పిస్తున్నారు. విద్యను ప్రోత్సహిస్తున్నారు.
తాజాగా కుప్పంలో రెండు పరిశ్రమల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు ఓకే చెప్పారు. ఈ రెండు పరిశ్రమలతో 8 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు నియోజకవర్గానికి రానున్నాయి. దీంతో పాటు సుమారు 5 వేల మంది స్థానికులకు ఉపాధి లభించనుంది. ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడనున్నాయి.
తాజాగా ఈ పరిశ్రమలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీటిలో పండ్ల గుజ్జు (పల్ప్ ఇండస్ట్రీ) పరిశ్రమను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా చిత్తూరులో ప్రధాన సమస్యగా ఇటీవలి కాలంలో తెరమీదకు వచ్చిన మామిడి కాయల వ్యవహారం భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంతేకాదు జిల్లా మొత్తానికి కూడా నియోజకవర్గం కేంద్రంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇలా ప్రతి విషయంలోనూ కుప్పం నియోజకవర్గంలో పనులు వేగంగా సాగుతున్నాయి. రహదారుల నిర్మాణం, ఇటీవలే కుప్పానికి నీరు ఇవ్వడం వంటివి నియోజకవర్గాన్ని నెంబర్ 1గా మారుస్తున్నాయని టీడీపీ నాయకులు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates