విజయవాడ నేతలపై మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు, ఎంపీపై కూడా ఆయన అసహనంతో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థలను టిడిపి నాయకులు కైవసం చేసుకున్నారు. సాధ్యం కాదు అనుకున్న చీరాల, విశాఖపట్నం వంటి చోట్ల కూడా టిడిపి నాయకులు జెండా పాతారు. ప్రస్తుతం 70 శాతం మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు టిడిపి పరిధిలోకి వచ్చాయి. జనసేన టిడిపి బిజెపి కూటమి నాయకులు వ్యూహాత్మకంగా పనిచేసి ఆయా మున్సిపాలిటీలలో పార్టీలను బలోపేతం చేయడంతో పాటు వైసిపి వర్గాన్ని చీల్చి తమ వైపు తిప్పుకున్నారు.
అయితే విజయవాడ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. విజయవాడలో ఇప్పటికీ వైసిపి నాయకులే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. వైసిపి కార్పొరేటర్లు, మేయర్ కొనసాగుతున్నారు. ఈ పరిస్థితి రాజకీయంగా టిడిపిలో ఆవేదన కలిగిస్తోంది. అధికారికంగా వైసిపి గెలిచిన ప్రదేశం కాబట్టి వచ్చే ఏడాది వరకు ఎదురు చూడక తప్పదు. కానీ, రాజకీయ ఆధిపత్య పోరును దృష్టిలో పెట్టుకుంటే విజయవాడను కైవసం చేసుకోలేకపోవడం టిడిపిలో చర్చగా మారింది.
దీనికి ప్రధాన కారణం ఇక్కడ చక్రం తిప్పే నాయకులు సరిగా వ్యవహరించకపోవడమేనని టిడిపి భావిస్తోంది. వైసిపి నాయకులు ఒక్కరంటే ఒక్కరు కూడా పార్టీ మారలేదు. కార్పొరేటర్ల నుంచి మేయర్ వరకు అందరూ వైసిపిలోనే కొనసాగుతున్నారు. డిప్యూటీ మేయర్ భర్తపై కేసు నమోదై జైలు శిక్ష అనుభవించినప్పటికీ వారు పార్టీ మారేందుకు నిరాకరించారు. బీసీ వర్గానికి చెందిన మేయర్ కూడా పార్టీ మారేందుకు ఇష్టపడడం లేదు.
వీరిలో ఎవరికైనా టిడిపి వైపు మళ్లించే వ్యూహాత్మక నాయకులు లేకపోవడమే పెద్ద లోపమని సీనియర్లు చెబుతున్నారు. లేకపోతే విశాఖపట్నం వంటి బలమైన కార్పొరేషన్ను టిడిపి కైవసం చేసుకున్నప్పుడు విజయవాడలో ఎందుకు సాధ్యం కాలేదన్నది నారా లోకేష్ ప్రశ్నిస్తున్న అంశం.
రాజధాని పరిధిలో ఉన్న విజయవాడలో టిడిపికి ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నప్పటికీ నిర్ణయాలు మాత్రం కార్పొరేషన్ పరిధిలో వైసిపి నేతలే తీసుకుంటున్నారు. ఫలితంగా పట్టాలు, తాగునీరు వంటి అంశాలలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనుకూలంగా ఉన్న వారిని టిడిపి వైపు మళ్లించే ప్రయత్నం కూడా స్థానిక నేతలు చేయకపోవడమే లోకేష్ అసహనానికి కారణమని పార్టీ సీనియర్లు చెబుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates