ఎన్డీయేకు తెర‌చాటు కాదు.. జ‌గ‌న్ బ‌హిరంగ మ‌ద్ద‌తు.. !

వైసిపి అధినేత జగన్ వ్యవహరిస్తున్న తీరు కూటమిలో కలవరాన్ని రేపుతోంది. ఇప్పటివరకు జగన్ తటస్థంగా ఉన్నారని భావిస్తూ వచ్చినప్పటికీ తాజా పరిణామాలతో ఆయన కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో చేతులు కలుపుతున్నారు అన్నది స్పష్టమైంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ కు మద్దతు ఇవ్వాలంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. తాజాగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్‌కు ఫోన్ చేశారు. మద్దతు ఇవ్వాలని జగన్‌ను కోరారు. దీంతో జగన్ ఆయనకు ఓకే అని చెప్పినట్టు తాడేపల్లి వరకు చెబుతున్నాయి.

వాస్తవానికి ఎన్డీఏ కూటమిలో జగన్ లేరన్న విషయం అందరికీ తెలిసిందే. పైగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి ఏపీలో ఉన్న టిడిపి బలమైన మద్దతుగా ఉంది. ఏపీలో టీడీపీ వైసీపీల మధ్య ఉన్న వర్గ విభేదాలు రాజకీయ వివాదాల గురించి అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో కేంద్రం నేరుగా జగన్ను సంప్రదించటం, తమకు మద్దతు ఇవ్వాలని కోరడం, ఈ విషయంపై చంద్రబాబుకు కనీసం సమాచారం కూడా లేకపోవడం వంటివి రాజకీయంగా టిడిపిలో చర్చనీయాంశంగా మారాయి.

నిజానికి టిడిపి కనుక మద్దతు ఉపసంహరించుకుంటే కేంద్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి ఉంది. అలాంటప్పుడు చంద్రబాబుకు కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవడం ఏంటన్నది సీనియర్ నాయకులు సంధిస్తున్న ప్రశ్న. మద్దతు ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది వైసిపి ఇష్టమే అయినప్పటికీ ఎన్డీఏ ప్రధాన పక్షంగా ఉన్న టిడిపిని కనీసం సంప్రదించకపోవడం, చంద్రబాబుకు సమాచారం కూడా ఇవ్వకపోవడం అనేది సరికాదన్నది టీడీపీ నాయకులు చెప్తున్నారు.

ఇట్లాంటి విషయంలో కనీసం సమాచారం ఇచ్చి ఉంటే బాగుండేది అన్నది వారు చెబుతున్న మాట. ముఖ్యంగా జగన్‌కి ఇప్పుడు పెద్ద బలం ఏమీ లేదని, అయినప్పటికీ ఎన్డీఏ నాయకులు ఆయనతో ఎందుకు మాట్లాడుతున్నారనేది సందేహంగా మారింది. రాష్ట్రంలో లిక్కర్ కుంభకోణం విషయంలో కూడా జగన్ అరెస్టు అంశం సందిగ్ధంలో పడటానికి కేంద్రంలోని పెద్దలే తెరవెనక ఉన్నారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. లేకపోతే జగన్ సహా మరో ఇద్దరు కీలక నాయకులు ఎప్పుడో అరెస్టయి ఉండేవారని కూడా అంటున్నారు.

ఈ పరిణామాలు జరుగుతున్న క్రమంలోనే అనూహ్యంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో కేంద్రం జగన్‌ను కోరడం, ఆయన మద్దతు ఇవ్వడం దీనికి సంబంధించిన సమాచారం చంద్రబాబుకు ఏమాత్రం తెలియకపోవడం అంటివి టిడిపిలో చర్చకు దారితీసాయి. మరి దీనిని చంద్రబాబు లైట్ తీసుకుంటారా లేకపోతే కేంద్రంలోని పెద్దలతో చర్చిస్తారా అనేది చూడాలి. కానీ ఇలాంటి పరిణామాలు మంచిది కాదని, ప్రజలకు సరైన సంకేతాలు అందువని టిడిపి నాయకులు అభిప్రాయపడుతున్నారు.