బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జల ప్రాజెక్టులకు సంబంధించి మరో కొత్త వివాదాన్ని తెరమీదికి తెచ్చారు. ఏపీ అంటే ఒకలాగా, తెలంగాణ అంటే మరోలా వ్యవహరిస్తున్నారు.. అంటూ కేంద్రంలోని బీజేపీపై విమర్శలు గుప్పించారు. తమ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో యాగీ చేస్తున్న వారు.. పొరుగున ఉన్న పోలవరం విషయంలో కళ్లు మూసుకున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ ఇప్పటికి రెండు సార్లు డ్యామేజీ అయిందని.. అయినా కేంద్రం నుంచి ఎవరూ రారని, కనీసం ఆ విషయాన్ని కూడా ప్రస్తావించబోరని వ్యాఖ్యానించారు.
కానీ, తమ హయాంలో అనేక ప్రయాసలు పడి.. అనేక రాష్ట్రాలను ఒప్పించి.. కష్టపడి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రం నానా యాగీ చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబ్టటారు. “కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒక నీతి.. పోలవరం ప్రాజెక్టుకు మరో నీతా?” అని కేటీఆర్ ప్రశ్నించారు. 2023 ఎన్నికల సమయంలో మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని, కానీ, దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆ అనుమానాలపై ఒక్కరంటే ఒక్కరు కూడా దృష్టి పెట్టకుండా.. రాజకీయంగా విమర్శలు చేయడానికి, విచారణలు చేయడానికి మాత్రం ముందుకు వచ్చారని కేటీఆర్ అన్నారు.
పనిలో పనిగా బీఆర్ ఎస్ పైనా, కేసీఆర్ పాలనపై కూడా విమర్శలు గుప్పించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇదేసమయంలో ఏపీలోని పోలవరం ప్రాజెక్టు కాఫర్ డ్యామ్ రెండు సార్లు కొట్టుకుపోయిందన్నారు. తాజాగా కూడా.. కాఫర్ డ్యామ్కు డ్యామేజీ అయిందని.. అయినా.. కూడా బీజేపీ నేతలు.. కేంద్రం నుంచి జాతీయ ప్రాజెక్టు సేఫ్టీ అథారిటీని రంగంలోకి దించడం లేదన్నారు. కానీ, మేడిగడ్డలో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే ‘కూలేశ్వరం’ అని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు.. దీనిపై పెద్ద కమీషన్ కూడా వేసి యాగీ చేస్తున్నారని అన్నారు. దమ్ముంటే.. కాంగ్రెస్, బీజేపీ నాయకులు.. పోలవరంపై కూడా.. విచారణకు ఆదేశించాలని.. దానినికూడా ‘కూలవరం’ అని పేర్కొనాలని సవాల్ రువ్వారు. కానీ, వారు ఆ పనిచేయబోరని దీనికి కారణం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates