బ్యాలెట్లలో సాధారణంగా ఓటర్లు.. తమ ఓటు హక్కును మాత్రమే వినియోగించుకుంటారు. కానీ.. తొలిసారి ఏపీలో ఓటర్లు తమ ఓటు హక్కుతో పాటు.. మనోభావాలను ప్రతిబింబించేలా కొన్ని వ్యాఖ్యలు రాసి.. వేరేగా కూడా స్లిప్పులు వేశారు. వీటిని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పులివెందుల, ఒంటిమిట్టల్లో ఈ నెల 12న జెడ్పీటీసీ అభ్యర్థుల స్థానాలకు ఉప ఎన్నిక జరిగింది. దీనిని ఈవీఎంతో కాకుండా బ్యాలెట్ విధానంలోనే నిర్వహించారు.
కేవలం అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు మాత్రమే ప్రస్తుతం ఈవీఎంలను వినియోగిస్తున్నారు. స్థానిక సంస్థలకు మాత్రం బ్యాలెట్ విధానంలో ఓటరు తనకు నచ్చిన అభ్యర్థిని ఎంచుకునే అవకాశం, ఎన్నుకునే అవకాశం రెండూ ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎన్నికల పోలింగ్లో ఓటర్లు బ్యాలెట్ విధానంలోనే తమ హక్కును వినియోగించుకున్నారు. అయితే..రెండు బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్లు.. తమ ఓటుతో పాటు ప్రత్యేకంగా స్లిప్పులు కూడా వేశారు.
గతంలో మోహన్బాబు, దివ్య భారతిలు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాలో కూడా ఇలానే ఓటర్లు.. తమ ఓటుతో పాటు ప్రత్యేకంగా స్లిప్పులను కూడా బాక్సుల్లో వేస్తారు. జైల్లో ఉన్న మోహన్బాబుపై అక్రమంగా కేసులు పెట్టారన్నది తాము నమ్ముతున్నామని ప్రజలు పేర్కొంటూ.. ఆయా స్లిప్పులపై రాశారు. అలానే ఇప్పుడు కూడా.. సేమ్ సీన్ రిపీట్ అయింది. పులివెందులలోని ఓ బాక్సులో ఓ ఓటరు.. వేసిన ప్రత్యేక స్లిప్పులో..’30 ఏళ్ల తర్వాత.. ఓటు వేస్తున్నా. అందరికీ దండాలు’ అని రాసి ఉంది. ఇక, ఒంటిమిట్టలోనూ ఇలానే రాసి ఉంది. ఈ స్లిప్పులను ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇక, ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, నకిలీ ఓటర్లు వచ్చారని వైసీపీ అధినేత జగన్ ఆరోపిస్తున్నారు. ఇదే నిజమై ఉంటే.. ఎవరైనా ఇలా రాస్తారా? తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టు చెబుతారా? అనేది ప్రశ్న. ఇదే విషయాన్ని టీడీపీ నేతలు కూడా ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేసిన కూటమికి కూడా ప్రజలు ధన్యవాదాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. మరి దీనిపై జగన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates