పులివెందులలో రీపోలింగ్.. తాడేపల్లిలో వైసీపీ అభ్యర్థి

ఏపీలో అటు అధికార పక్షం రథసారథి టీడీపీ, ఇటు విపక్షం వైసీపీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మంగళవారం పోలింగ్ ముగిసిన తర్వాత బుధవారం కూడా ఈ విచిత్రాల పరంపర కొనసాగింది. పులివెందుల జడ్పీటీసీ ఎన్నిక తీరుపై ఒకింత అనుమానం కలిగిన ఎన్నికల సంఘం… రెండు పోలింగ్ కేంద్రాల్లో బుధవారం రీపోలింగ్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆ కేంద్రాల్లో రీపోలింగ్ బుధవారం ప్రారంభం కాగా… వైసీపీ అభ్యర్థి మాత్రం తాడేపల్లిలోని జగన్ వద్దకు చేరిపోయారు. జగన్ నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన దర్శనమిచ్చారు.

పులివెందులతో పాటు కడప జిల్లాలోని ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలోనూ వైసీపీ ముందుగానే చేతులెత్తేసిందని ఇదివరకే చెప్పుకున్నాం కదా. అదే మాదిరిగా వైసీపీ వ్యవహరిస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మంగళవారం పోలింగ్ జరుగుతూ ఉంటే… వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి తన ఇంటి గడప కూడా దాటకుండా తాము ఓటు వేసేందుకు అవకాశమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా తనకు భద్రత కల్పించడంలో పోలీసులు ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు. అయితే ఇద్దరు పోలీసులతో హేమంత్ కు భద్రత కల్పించామని, వారిలో ఓ సీఐ స్థాయి అధికారి కూడా ఉన్నారని స్వయంగా కడప జిల్లా ఎస్పీనే ప్రకటించడం గమనార్హం.

ఇక తాజాగా రీపోలింగ్ కు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేస్తే… రీపోలింగ్ ను బహిష్కరిస్తున్నట్లు కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి ప్రకటించారు. మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేసిన ఆయన.. కేవలం పోలీసులను రక్షించేందుకే ఎన్నికల సంఘం రెండు పోలింగ్ కేంద్రాల్లోనే.. అది కూడా ఎలాంటి గొడవలు జరగని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహణకు సిద్ధపడిందని ఆయన తనదైన శైలి వితండ వాదనను వినిపించారు. మొత్తంగా రీపోలింగ్ ను వైసీపీ అయితే బహిష్కరించింది. జగన్ పిలుపు మేరకు ఒంటిమిట్ట వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డితో కలిసి హేమంత్ రెడ్డి ఎంచక్కా తాడేపల్లి చేరుకుని జగన్ కు అటొకరు, ఇటొకరు కూర్చుని మీడియా కెమెరాలకు కనిపించారు.