ఏపీ రాజధాని అమరావతి పనుల్లో ఊహించని వేగం కనిపిస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. తాజాగా అమరావతి పనులపై ఆయన సమీక్షించారు. మంత్రి నారాయణ, రాజధాని ప్రాంత సాధికార అథారిటీ (సీఆర్డీఏ) అధికారులు, అదేవిధంగా రాజధానిలో పనులు చేస్తున్న వివిధ కాంట్రాక్టర్లు కూడా సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు పనుల పురోగతిపై సంతోషం వ్యక్తం చేశారు. రికార్డు స్థాయిలో పనులు చేపట్టారని, అయితే నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడవద్దని సూచించారు. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 81,317 కోట్ల రూపాయల పనులను సీఆర్డీఏ ప్రతిపాదించిందని సీఎం చెప్పారు.
వీటన్నింటికీ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చంద్రబాబు చెప్పారు. ప్రస్తుతం 50 వేల కోట్ల రూపాయలకు పైగా పనులకు టెండర్లు పిలిచామని, ఇప్పటి వరకు 74 కీలక ప్రాజెక్టులకు సంబంధించిన పనులు జోరుగా సాగుతున్నాయని పేర్కొన్నారు. వీటిలో న్యాయ, విద్య, ఉద్యోగుల క్వార్టర్లు సహా నవనగరాలకు సంబంధించిన ఇతర నగరాలు ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా వరద నీరు పోయేలా డెక్టులు, రహదారుల నిర్మాణం, డ్రైనేజీ పనులు కూడా ఈ ప్రాజెక్టుల్లో ఉన్నాయని తెలిపారు. రికార్డు సమయంలో పనులు చేస్తున్నారని కాంట్రాక్టర్లను, పనులు చేసేలా ప్రోత్సహిస్తున్నారని మంత్రి నారాయణను చంద్రబాబు అభినందించారు.
2029 టార్గెట్
రాజధాని అమరావతి పనులను 2029 నాటికి 70 శాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని మంత్రి నారాయణకు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. నిధులకు సంబంధించి కేంద్రం నుంచి మంచి సహకారం లభిస్తోందని అన్నారు. అదేవిధంగా రుణ సంస్థలు (ప్రపంచ బ్యాంకు, ఏడీబీ) కూడా మన సంకల్పాన్ని అర్థం చేసుకున్నాయని, త్వరితగతిన రుణాలు ఇస్తున్నాయని చెప్పారు. ఈ నిధులను ప్రతిపాదిత పనులకు కేటాయించాలని, పనులు ఆగకుండా చూడాలని సూచించారు. ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో కూడా పనులు ఆగకుండా చూడాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించవచ్చని సీఆర్డీఏ అధికారులకు చంద్రబాబు సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates