అమరావతికి గెజిట్… బాబుకు ఇదో సంకటం!

అమరావతి… నవ్యాంధ్ర రాజధాని. అయితే, దీనిని సుస్థిరంగా ఉంచాలన్నది టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆలోచన. దీనికిగాను కేంద్రంతో ఒప్పించి, మెప్పించి గెజిట్ జారీ చేయించాలనీ, తద్వారా ఎవరు వచ్చినా అమరావతి జోలికి పోకుండా రాజధానిని కదపకుండా చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకులు, మంత్రులు, ముఖ్యంగా రాజధానికి భూములు ఇచ్చిన రైతులు కోరుతున్నారు. కొన్నాళ్ల క్రితం మరిన్ని భూములు కావాలంటూ ప్రభుత్వం ప్రతిపాదన చేసిన సమయంలో రైతులు ఈ విషయాన్ని తేల్చి చెప్పారు.

వాస్తవానికి విభజన చట్టం ప్రకారం ఏపీకి ఒక రాజధాని ఉండాలి. ఇదే గతంలో మూడు రాజధానులను వ్యతిరేకించి అమరావతిని నిలబెట్టుకునే క్రమంలో పనిచేసిన మంత్రం. అయితే, ఆ ఒక రాజధానిని సుస్థిరం చేసుకోవాలన్నది రైతులు చెబుతున్న మాట. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మళ్లీ కూటమి రావాలని కోరుకునే వారు ఉన్నా, వైసీపీ ప్రయత్నాలు వైసీపీ చేస్తోంది. దీంతో ఎవరు అధికారంలో ఉన్నా అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తించాలన్నది ఇక్కడి రైతులు కోరుతున్నారు.

ఈ క్రమంలో కీలకమైన గెజిట్‌ను జారీ చేయించడం ద్వారా ఏపీ రాజధానిగా అమరావతిని గుర్తించి, కేంద్ర జాబితాలో చేర్చడం ద్వారా అమరావతికి శాశ్వత ముద్ర వేయాలని కోరుతున్నారు. అయితే, ఇది అంత తేలికేనా అనేది ప్రశ్న. ఈ విషయంలో కేంద్రం పూనిక వహిస్తే తప్ప సాధ్యం కాదు. దీనికి కేంద్రం సిద్ధపడాల్సి ఉంది. రాష్ట్రం కూడా ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది. అయితే, ఒక్కసారి గెజిట్ వస్తే ఇక రాజధాని ప్రాంతాన్ని విస్తరించేందుకు అవకాశం ఉండదన్నది అధికారులు చెబుతున్న మాట.

కానీ, ప్రస్తుతం రాజధానిని మరో 44 వేల ఎకరాలకు విస్తరించి, మొత్తం 77 వేల ఎకరాల విస్తీర్ణంలో అమరావతిని ఏర్పాటు చేయాలని చంద్రబాబు తలపోస్తున్నారు. ఇదే గెజిట్ కోసం ప్రయత్నించడంలో ఇబ్బందులు తెస్తోంది. ముందు భూసమీકરણ పూర్తి చేసుకుంటే, తర్వాత గెజిట్ తీసుకురావచ్చని భావిస్తున్నారు. ఇప్పటివరకు 33 వేల ఎకరాలకే అమరావతి పరిమితమైంది. మరో 44 వేల ఎకరాల సేకరణ ఒకరకంగా ఇబ్బందిగానే ఉంది. దీనిని త్వరగా పూర్తి చేసి, ప్రజాభిప్రాయం సేకరించి, అసెంబ్లీలో ఆమోదించుకుని కేంద్రానికి పంపితే అప్పుడు గెజిట్ పూర్తవుతుంది. దీనికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.