ట్రంప్ దెబ్బకు వెనక్కి తగ్గిన అమెజాన్, వాల్‌మార్ట్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన 50 శాతం సుంకాలు భారత దిగుమతి వ్యాపారాన్ని గందరగోళంలోకి నెట్టేశాయి. ముఖ్యంగా అమెజాన్, వాల్‌మార్ట్, టార్గెట్, గ్యాప్ వంటి అమెరికన్ రిటైల్ దిగ్గజాలు భారత్ నుంచి వస్త్రాలు, ఫ్యాషన్ ఉత్పత్తుల స్టాక్‌ను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ సంస్థలు భారత టోకు వ్యాపారులకు లేఖలు, మెయిల్స్ పంపిస్తూ, తదుపరి సూచనలు వచ్చేవరకు ఎగుమతులను నిలిపేయాలని కోరాయి. దీంతో ఎగుమతి రంగం తీవ్ర ఆందోళనలో పడింది.

ఇప్పటికే ట్రంప్ విధించిన 25 శాతం టారిఫ్‌లు అమల్లోకి వచ్చాయి. తాజాగా మరో 25 శాతం అదనపు సుంకులు ఆగస్టు 27 నుంచి అమల్లోకి రానున్నాయి. ఇలా కలిపి 50 శాతం టారిఫ్‌లతో, అమెరికాలో భారత ఉత్పత్తుల ధరలు 30-35 శాతం వరకు పెరగనున్నాయి. దీనివల్ల కొనుగోలుదారులు కొత్త ఆర్డర్లు ఇవ్వడం తగ్గించుకుంటున్నారు. అమెరికా సంస్థలు “ఈ అదనపు ఖర్చును ఎగుమతిదారులే భరించాలి” అని డిమాండ్ చేయడంతో, కొన్నిచోట్ల ఒప్పందాలు కూడా క్యాన్సిల్ అయ్యే పరిస్థితి ఉంది.

ప్రధానంగా ఇండియా నుంచి అమెరికాకు పెద్దఎత్తున దుస్తులు, టెక్స్‌టైల్, తోలు ఉత్పత్తులు, ఆక్వా ఫార్మ్ ఫిష్, ఇతర ఫ్యాషన్ ఉత్పత్తులు ఎగుమతవుతుంటాయి. ప్రముఖ ఎగుమతి సంస్థల్లో వేల్‌స్పన్ లివింగ్, గోకల్‌దాస్ ఎక్స్‌పోర్ట్స్, ట్రైడెంట్, ఇండోకౌంట్ వంటి కంపెనీలు తమ వ్యాపారం 45-70 శాతం వరకు అమెరికా మార్కెట్‌పైనే ఆధారపడ్డాయి. తాజా టారిఫ్‌లతో అమెరికా నుంచి వచ్చే ఆర్డర్లు 50 శాతం తగ్గే అవకాశం ఉంది. వస్త్ర పరిశ్రమలోనే రూ.4-5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

భారతీయ దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులు అమెరికాకు పెద్ద ఎగుమతి రంగంగా కొనసాగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 36.61 బిలియన్ డాలర్ల ఎగుమతుల్లో 28 శాతం అమెరికాకే చేరాయి. కానీ ఇప్పుడు టారిఫ్ పెంపుతో, అమెరికా సంస్థలు బంగ్లాదేశ్, వియత్నాం వంటి ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు చూసే అవకాశం ఉంది. మొత్తానికి, ట్రంప్ తాజా నిర్ణయం భారత ఎగుమతి రంగాన్ని ఒక్కసారిగా డీలా చేసింది. మారి భారత్ ఈ విషయంలో ఏ విధమైన అడుగులు వేస్తుందో చూడాలి.