మాకు మ‌రో మార్గం లేదు: సీఎం రేవంత్ రెడ్డి

బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేషన్ క‌ల్పించే విష‌యంలో సీఎం రేవంత్ రెడ్డి ప‌ట్టుద‌ల‌తోనే అడుగులు వేస్తున్నారు. అయితే.. ఆయ‌నకు స‌రైన మార్గ‌మే ఇప్పుడు క‌నిపించ‌డం లేదు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా రేవంతే చెప్పుకొచ్చారు. రిజ‌ర్వేష‌న్ విష‌యంలో ప‌ట్టుద‌ల‌తోనే ఉన్నామ‌ని.. బీసీల‌కు న్యాయం చేయాల‌ని ప్ర‌యత్నిస్తున్నామ‌ని తెలిపారు. తాజాగా గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. రాష్ట్ర‌పతికి బిల్లు పంపించినా.. ఆమోదం తెల‌ప‌డం లేద‌న్నారు.

అయిన‌ప్ప‌టికీ… త‌మ ప్ర‌య‌త్నాలు తాముచేస్తామ‌ని చెప్పారు. ఈ విష‌యంలో తెర‌వెనుక ఏంజ‌రుగుతోందో కూడా ప్ర‌జ‌ల‌కు తెలియాల్సి ఉంద‌న్నారు. రాష్ట్ర‌ప‌తి పై కేంద్రం ఒత్తిడి చేస్తోంద‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయ‌ని తెలిపారు. అయితే.. ఏదో ఒక‌ర‌కంగా.. రిజ‌ర్వేష‌న్ క‌ల్పించేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామ‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. అయితే.. ఆయా మార్గాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయ‌ని తెలిపారు. స్థానిక సంస్థ‌ల‌ను వాయిదా వేసి, ఈ బిల్లు ఆమోదం పొందే వ‌ర‌కు కూడా వేచి చూడాల‌ని ఉంద న్నారు. కానీ, హైకోర్టు ఉత్త‌ర్వుల నేప‌థ్యంలో ఎన్నిక‌లు వాయిదా వేయ‌లేమ‌న్నారు.

అదేస‌మ‌యంలో పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గక‌పోతే.. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా ఆగి పోతాయ‌న్నారు. దీంతో ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి త‌ప్ప‌ద‌న్నారు. పోనీ.. గ‌త ప్ర‌భుత్వం తీసుకువ చ్చిన 50 శాతం సీలింగ్ జీవోను ప‌క్కన పెట్టి వెళ్లాల‌న్నా.. కోర్టుకు వెళ్లే అవ‌కాశం ఉంద‌న్నారు. ఇది కూడా ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మేన‌ని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ నేప‌థ్యంలో స్వ‌తంత్రంగా రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేసేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌ని సీఎం చెప్పారు. అంటే.. సొంతగా పార్టీలోనే ఈ రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయ‌నున్న‌ట్టు వివ‌రించారు.

దీనిని బ‌ట్టిపార్టీప‌రంగా టికెట్లు పొందే వారిలో 42 శాతం మంది బీసీల‌కు న్యాయం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌న్నారు. అయితే.. తొలుత అన్ని ప్ర‌యత్నాలు చేస్తామ‌ని.. ఎక్క‌డా కూడా విశ్ర‌మించేది లేదని తేల్చి చెప్పారు. బీసీ స‌మాజం ఎదురుచూస్తోంద‌న్నారు. కానీ.. విష‌యం తెలిసి కూడా.. అవ‌గాహ‌న లేకుండా.. కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు.