కేంద్ర మంత్రిగా ఉన్నా లేకున్నా: బండి సంచలన వ్యాఖ్యలు

“కేంద్ర మంత్రిగా ఉన్నా లేకున్నా నేను మారను. నేను ప్రజల మనిషిని. నాపై వచ్చే అవాస్తవాలను ప్రచారం చేయొద్దని కోరుతున్నా” అని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన చొప్పదండి నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత వారం రోజులుగా బండి సంజయ్‌పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ప్రస్తావించారు. కేంద్ర మంత్రి పదవి నుంచి తనను పక్కకు తొలగిస్తున్నారని కొందరు చెబుతున్నట్టు తెలిపారు. అదే విధంగా మరికొందరు తానే రాజీనామా చేస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.

అయితే ఈ రెండూ కూడా అవాస్తవాలేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. తాను మంత్రి అయ్యాక కూడా ప్రజల కోసం పాదయాత్ర చేసిన వ్యక్తినని గుర్తు చేశారు. బీజేపీకి తగిన వ్యూహాలు, ప్రణాళికలు ఉంటాయని చెప్పారు. తన సేవలు ఎక్కడ అవసరమో అక్కడ వినియోగించే స్వేచ్ఛ పార్టీకి ఉంటుందని చెప్పారు. గతంలో తనకు మంత్రి పదవి కావాలని ఎప్పుడూ కోరలేదని, ఆహ్వానం ఇచ్చి తనకు పదవి ఇచ్చారని వెల్లడించారు. భవిష్యత్తులో పార్టీ అవసరముంటే ఎక్కడైనా పని చేయడానికి తానెప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు.

కానీ కొందరు పనిలేని వారు తనపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. తాను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల కోసమే ఉన్నానని పేర్కొన్నారు. తానే సంపాదించుకోలేదని, సంపాదించినవారు తనపై విమర్శలు చేయడం తగదని అన్నారు. ఒక్కొక్కరి లెక్కలు త్వరలో తేలతాయంటూ వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల్లో రైతులకు 71 లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అరకొర రుణాలను తీర్చేసి మొత్తం తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

ఇక కీలకమైన రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావిస్తూ, 42 శాతం రిజర్వేషన్ ఒక వర్గానికే ఇస్తే మిగిలిన వర్గాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. “నేను కూడా బీసీ బిడ్డనే. కానీ ముస్లింలకు 10 శాతం ఇచ్చి, అదే సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంటే అది సాధ్యమా? ఇది రాజకీయ ప్రేరణతో చేసిన పని కాదా? ఎవరి కళ్లకు ధూపం చూపిస్తున్నారు?” అని నిలదీశారు. ప్రజల ప్రయోజనం నిజంగా ఉంటే మైనారిటీల రిజర్వేషన్ తొలగించి, అప్పుడు బీసీలకు ఇవ్వాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దొంగాట ఆడుతోందని, బీజేపీ మాత్రం బీసీలకు మేలు చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. “బీసీ బిడ్డగా ప్రధాని పదవిని మోదీకి ఇచ్చింది కూడా బీజేపీయే కదా” అని అన్నారు.