‘డెడ్ బాడీ డోర్ డెలివరీ’ అనంతబాబుకు మళ్లీ తిప్పలే!

వైసీపీ హయాంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద పనిచేసిన కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి.. ఆ శవాన్ని అతని ఇంటికే స్వయంగా తీసుకెళ్లి అప్పగించిన విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసు బాధ్యత తనదేనని.. తాను హత్య చేశానని అప్పట్లో పోలీసులకు అనంతబాబు తెలిపారు. ఇది మరో సంచలనం. ఆ కేసులో అరెస్టైన అనంతబాబు కొన్నాళ్లు జైల్లో ఉన్న తరువాత మధ్యంతర బెయిల్ తెచ్చుకున్నారు. అప్పటి నుంచి కూడా కేసు ముందుకు సాగలేదు.

2022 మే 19న జరిగిన ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు అప్పట్లో వైసీపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నించింది. నేరారోపణ ఎదుర్కొంటున్న అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలనీ, పార్టీ నుంచి బహిష్కరించాలనీ పౌర సంఘాలు, దళిత సంఘాల నుండి డిమాండ్లు వచ్చాయి. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని డైల్యూట్ చేయడానికి ప్రయత్నించింది. చివరకు తూతూ మంత్రంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసినా.. నాలుగైదు నెలలకే ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకున్నారు. గత ఎన్నికల సమయంలో పార్టీ తరఫున ప్రచారం కూడా చేశారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాధిత కుటుంబం మంత్రి సుభాష్‌ను కలిసి విన్నవించింది. దీంతో ఈ వ్యవహారంపై దృష్టి పెట్టిన ప్రభుత్వం సుబ్రహ్మణ్యం కుటుంబానికి ఆర్థిక సహాయం అందించింది. ఇక తాజాగా ఈ కేసును మరోసారి విచారించేందుకు వీలుగా రాజమండ్రి కోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ అభ్యర్థనకు కోర్టు అనుమతి కూడా వచ్చింది. దీంతో డోర్ డెలివరీ కేసును తిరిగి విచారించనున్నారు. ఈ పరిణామాలతో అనంతబాబు మెడకు ఉచ్చు బిగిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న అనంతబాబును తిరిగి జైల్లోకి పంపేందుకు పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. అనంతరం ఆయన విదేశాలకు పారిపోకుండా లుక్‌ఔట్ నోటీసులు కూడా ఇవ్వనున్నట్టు, సుబ్రహ్మణ్యం తరఫున ప్రభుత్వం నియమించిన స్పెషల్ ప్రాసిక్యూటర్ తెలిపారు.