వైసీపీ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డిని మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు అరెస్టు చేయడం.. ఆ వెంటనే ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించడం జరిగిపోయాయి. అయితే.. ఈ ఘటనలపై వైసీపీ అధినేత జగన్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా సుదీర్ఘ స్పందన వెలిబుచ్చారు. మిధున్ రెడ్డి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. ఇది ప్రజలతో నిలబడే వారి నోరు మూయించడానికి రూపొందించిన రాజకీయ కుట్ర తప్ప మరొకటి కాదని వ్యాఖ్యానించారు. వరుసగా మూడుసార్లు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన మిధున్ రెడ్డిని బలవంతపు వాంగ్మూలాల ఆధారంగా తప్పుడు కేసులో ఇరికించారని పేర్కొన్నారు.
ఇది టీడీపీ ప్రభుత్వం మోసాలు, వైఫల్యాలను కప్పిపుచ్చడానికి చేసిన రాజకీయ ప్రతీకార చర్యగా జగన్ అభివర్ణించారు. మద్యం కుంభకోణం కేవలం మీడియా నాటకాల కోసం, నిజమైన సమస్యల నుండి దృష్టిని మళ్లించడానికి సృష్టించబడిన కల్పిత కథనం తప్ప మరొకటి కాదన్నారు. మొత్తం కేసు.. ఒత్తిడి, బెదిరింపులు, థర్డ్-డిగ్రీ హింస.. లంచాలు, ప్రలోభాల ద్వారా సేకరించిన ప్రకటనలతో అల్లిందని వ్యాఖ్యానించారు. 2014 – 19 కాలంలో మద్యం విధానానికి సంబంధించిన సమస్యలపై కేసులో చంద్రబాబు స్వయంగా బెయిల్పై ఉన్నాడనే వాస్తవం విస్మరిస్తున్నారని తెలిపారు.
చంద్రబాబు ఎందుకు ఇంత దిగజారిపోయాడనే దానికి తిరుగులేని సాక్ష్యం ఇదేనని పేర్కొన్నారు. 2014-19 కాలంలో జరిగిన చర్యలకు సంబంధించి తన కేసును కొట్టివేయాలని, 2024-29కి తన విధానాన్ని ఇప్పుడు సమర్థించుకోవాలని ఆయన కోరుకుంటున్నారనేది వాస్తవమని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని తప్పుబడుతున్నారని తెలిపారు. మరింత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, వైసీపీ నాయకులపై మద్యం కుంభకోణం ఆరోపణలు చేస్తూనే, ప్రస్తుత కూటమి ప్రభుత్వం.. వైసీపీ హయాంలో రద్దు చేసిన అవినీతి మద్యం పద్ధతులను తిరిగి తెస్తోందన్నారు.
బెల్టుషాపులు, పర్మిట్ రూమ్ల పేరుతో అక్రమ మద్యం దుకాణాలు తిరిగి వచ్చాయని జగన్ పేర్కొన్నారు. తమ హయాంలో వేలాది బెల్టుషాపులు, పర్మిట్ రూమ్లను మూసివేయడం, మద్యం దుకాణాలను గణనీయంగా తగ్గించడం వంటి చర్యలు తీసుకున్నామన్నారు. అయితే.. ఇప్పుడు వాటిని తిరిగి తీసుకువస్తున్నారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు పర్మిట్ రూమ్లు, బెల్టుషాపులు, ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం అమ్మకాలను ప్రోత్సహిస్తోందన్నారు. అవినీతి, మాఫియా వైన్ షాపుల లైసెన్సులు ఇచ్చే ప్రక్రియలోకి తిరిగి ప్రవేశించాయని ఆరోపించారు.
టీడీపీ అసలు ఎజెండా ఇప్పుడు స్పష్టంగా అర్ధమవుతోందని జగన్ పేర్కొన్నారు. దర్యాప్తు ముసుగులో వైఎస్ఆర్సిపి నాయకులను అరెస్టు చేయడానికి, వారిని నిరవధికంగా జైలులో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పారు. చట్టపరమైన ప్రక్రియను సాగదీసేందుకు సిట్ను ఉపయోగించాలనుకుంటున్నారని, కానీ అసలు విచారణ ప్రారంభమైన తర్వాత, నిజం బయటపడుతుందన్నారు. “ఇది నిరాధారమైన, రాజకీయంగా ప్రేరేపించబడిన కేసు, దీనికి చట్టపరమైన అర్హత లేదు.” అని జగన్ పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates