తూర్పు-ప‌డ‌మ‌ర‌ను త‌ల‌పిస్తున్న బీఆర్ఎస్ పాలిటిక్స్‌!

తెలంగాణ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషిస్తున్న ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ రాజ‌కీయాలు తూర్పు-ప‌డమ‌ర అన్న‌ట్టుగా సాగుతున్నాయ‌న్న చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. ఈ పార్టీకి చెందిన ఇద్ద‌రు కీల‌క నాయ‌కులు.. ఎవ‌రికి వారుగా రాజ‌కీయాలు చేసుకుంటారు. ఒకే రోజు ఇద్ద‌రూ విభిన్న కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. అయితే.. ఇరువురూ క‌లిసి ఈ కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. దీంతో ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా బీఆర్ఎస్ రాజ‌కీయాలు న‌డుస్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.

వారే.. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే కేటీఆర్‌, ఆయ‌న సోద‌రి ఎమ్మెల్సీ, జాగృతి నాయ‌కురాలు క‌విత‌. ఇద్ద‌రూ కూడా ఒకే పార్టీ గొడుగు కిందే ఉన్నారు. కానీ, క‌లివిడి లేని విడివిడి రాజ‌కీయాల్లో మునిగిపోయారు. ఎవ‌రికి వారే అన్న‌ట్టుగా రాజ‌కీయ ఉద్య‌మాల‌కు పిలుపునిచ్చారు. అంత‌కాదు.. ఆ ఇంటిపై కాకి. ఈ ఇంటిపై వాల‌కూడ‌ద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌విత విష‌యానికి వ‌స్తే.. రిజ‌ర్వేష‌న్ల‌ను 42 శాతానికి పెంచాల‌ని.. బీసీల‌కు న్యాయం చేయాల‌ని కోరుతూ.. రైల్ రోకో ఉద్య‌మానికి మ‌రోసారి పిలుపునిచ్చారు.

దీనికి బీఆర్ఎస్‌లోని కేటీఆర్ ప‌క్షం దూరంగా ఉంది. అదేస‌మ‌యంలో కేసీఆర్ ప‌క్ష నాయ‌కులుగా ముఖ్యంగా త‌ట‌స్థంగా ఉన్న నాయ‌కులు కూడా దూరంగా ఉన్నారు. దీంతో క‌విత బాధ క‌వితది అన్న‌ట్టుగా ఉంది. ఇక‌,కేసీఆర్ విష‌యానికి వ‌స్తే.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీల‌ను అమ‌లు చేయించే బాధ్య‌త తీసుకుంటామ‌ని చెప్పిన ఆయ‌న త్వ‌ర‌లోనే పంచాయ‌తీ స్థాయిలో ఉద్య‌మాలు నిర్మిస్తామ‌ని చెప్పారు.

అంటే.. ప్ర‌భుత్వంపై మూకుమ్మ‌డిగా ఉద్య‌మాల‌కు పిలుపునిచ్చినా.. అన్నా చెల్లెళ్ల మ‌ధ్య మాత్రం ఈ ఉద్య‌మాల విష‌యంలోనే స‌ఖ్య‌త లేకుండా పోయింది. కేటీఆర్ వైపు హ‌రీష్‌రావు స‌హా.. మాజీ మంత్రులు నిల‌బ‌డ్డారు. ఇక‌, క‌విత వైపు.. కీల‌క నాయ‌కులు ఎవ‌రూ లేక‌పోయినా.. జాగృతి కార్య‌క‌ర్త‌లు మాత్రం ఉన్నారు. అయితే.. ఇలా ఎవ‌రికి వారు త‌మ బ‌లం-స‌త్తా నిరూపించుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని.. ఇలా చేయ‌డం వ‌ల్ల బీఆర్ఎస్ మ‌రింత బ‌ల‌హీన‌ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.