వాటీజ్ దిస్ ఫైవ్ ప‌ర్సంట్‌…: ఏపీ బీజేపీ

ఏపీ.. కూట‌మి ప్ర‌భుత్వంలో కీల‌క భాగ‌స్వామ్య ప‌క్షంగా ఉన్న బీజేపీలో అసంతృప్తి పెల్లుబుకుతోంది. కూట‌మిలో తాము కీల‌కంగా ఉన్నామ‌ని.. అయినా.. త‌మ‌కు ప్రాధాన్యం అంతంత మాత్ర‌మేన‌ని సీనియ‌ర్ నాయ‌కులు, ఆర్ఎస్ఎస్ భావ‌జాలం ఉన్న నాయ‌కులు భావిస్తున్నారు. రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది అయింది. అయితే.. ఈ ఏడాదిలో కొన్ని నామినేటెడ్ ప‌ద‌వుల‌ను సీఎం చంద్ర‌బాబు భ‌ర్తీ చేశారు. వీటిలో కొన్నింటిని బీజేపీకి ఇచ్చారు.

ఈ వ్య‌వ‌హారమే ఇప్పుడు.. చ‌ర్చ‌గా మారింది. త‌మ‌కు ప‌ద‌వుల విష‌యంలో అన్యాయం జ‌రుగుతోంద‌ని.. విశాఖ ఉత్త‌రం ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నామినేటెడ్ ప‌ద‌వుల్లో జ‌రుగుతున్న అన్యాయంపై గ‌ట్టిగానే ప్ర‌శ్నించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న ఆయ‌న‌.. కూట‌మి ఐక్య‌త‌పైనా ప్ర‌శ్న‌లు గుప్పించారు. బీజేపీతో ఉన్నంత వ‌రకే కూట‌మికి బ‌లం ఉంటుంద‌న్న విష‌యాన్ని ‘కొంద‌రు’ గుర్తు పెట్టుకోవాల‌ని ప‌రోక్షంగా ఆయ‌న సీఎం చంద్ర‌బాబు పై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

ఈ క్ర‌మంలోనే వాటీజ్ దిస్ ఫైవ్ ప‌ర్సంట్‌? అని విష్ణుకుమార్ రాజు ప్ర‌శ్నించారు. “ప‌ద‌వుల విష‌యం ప్రశ్నిస్తే.. మాకు 80 శాతం ఉంది.. మరో పార్టీకి 15 శాతం ఉంది.. మీకు(బీజేపీకి) 5 శాత‌మే భాగ‌స్వామ్యం ఉంది.. కాబ‌ట్టి.. ఐదు శాత‌మే ప‌ద‌వులు ఇస్తున్నాం.. అంటున్నారు. కానీ, అస‌లు కూట‌మిలో బీజేపీ లేక‌పోతే.. ఏం జ‌రుగుతుందో అంద‌రికీ తెలుసు” అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

“బీజేపీ పార్టీ కూటమిలో కలిసి ఉండకపోతే పరిస్థితులు ఎలా ఉండేవో రాష్ట్రప్రభుత్వానికి తెలియజేయా లి..! మాట్లాడితే ప్రభుత్వంలో మీది ఐదు శాతం వాటా అంటున్నారు. వాట్ ఈజ్ దిస్ 5 పర్సంట్…దిసీజ్ రెడిక్యులస్. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ వాటా పెరగాలి. మీకు 5 శాతమే ఉంది మీకు ఇంతే ఇస్తామంటే కుదరదు. దశాబ్ధాలుగా పార్టీ జెండా మోసిన వారికి పదవులు ఇవ్వకుండా ఎగనామం పెట్టడం సరికాదు. కూటమి కచ్చితంగా కలిసి ఉండాలి…మన వాటా మనకు దక్కాలి” అని విష్ణు వ్యాఖ్యానించారు.