సాయిరెడ్డి సీటు ఖాళీగానే ఉంచారే.. విష‌యం ఏంటో ..!

విజ‌య‌సాయి రెడ్డి. వైసీపీ కీల‌క నాయ‌కుడు.అయితే.. ఇప్పుడు ఆయ‌న‌ లేని లోటు వైసీపీలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు అన్ని తానే వ్యవహరించి, పార్టీని ముందుకు నడిపించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా వైసిపి వ్యవహారాలను భుజాన వేసుకుని చక్కదిద్దారు. జగన్ తర్వాత వైసీపీలో ఒకప్పుడు విజయసాయి రెడ్డి పేరు బాగా వినిపించేది. ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తెర‌మీదకు వచ్చిన విషయం తెలిసిందే. కానీ 2014 -19 మధ్య కాలంలో మాత్రం జగన్ తర్వాతే ఎవరూ అంటే విజయసాయిరెడ్డి పేరు బలంగా అందరూ చెప్పేవారు.

అలాగే ఢిల్లీలో కూడా విజయసాయిరెడ్డి పేరు మార్మోగింది. అలాంటిది పరిస్థితుల ప్రభావం, రాజకీయాల ప్రభావమో తెలియదు కానీ విజయ సాయి రెడ్డి వైసీపీని వదిలేసి ఆరు మాసాల పైనే అయిపోయింది. అయితే ఇప్పటివరకు కూడా విజయ‌సాయి రెడ్డి తరహా రాజకీయాలు చేయగలిగే నాయకుడు, పార్టీని లౌక్యంగా ముందుకు తీసుకువెళ్లే నాయకుడు వైసీపీలో కనిపించలేదు, వాస్తవానికి ఒక పోస్టు ఖాళీ అయితే వెంటనే ఆ పోస్టును భర్తీ చేసేందుకు ఎవరో ఒకరిని నియమిస్తారు, ఇది అన్ని పార్టీలలోను ఉన్న విషయమే.

అయితే వైసీపీ విషయానికి వచ్చేసరికి విజయ సాయి రెడ్డి పోషించిన పాత్ర, నిర్వహించిన పదవులు ఇప్పటికీ ఖాళీగానే కనిపిస్తున్నాయి, పార్టీ వ్యవహారాలు కావచ్చు, ఢిల్లీలో రాజకీయ వ్యవహారాలు కావచ్చు.. ఏవైనా తనదైన శైలిలో అయిన ముందుకు తీసుకెళ్లారు, నాటి నుంచి నేటి వరకు అంటే విజయ సాయి రెడ్డి పార్టీని వదిలేసి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నాటి నుంచి ఇప్పటివరకు కూడా ఆ పదవిని ఎవరికి ఇవ్వలేదు, ఆ పోస్టును ఇప్పటివరకు భర్తీ చేయలేదు.

అంటే సాయి రెడ్డికి సమానమైనటువంటి నాయకుడు లేడని భావిస్తున్నారా లేకపోతే ఆయ‌న మ‌ళ్లీ త‌మ పార్టీలోకే వ‌స్తార‌ని అనుకుంటున్నారో తెలియదు గానీ సాయి రెడ్డి వ్యవహారం తాజాగా పార్టీ నాయకుల మధ్య చర్చకు రావడం గ‌మ‌నార్హం. దీంతో ఆ పోస్ట్ గురించి, ఆయన గురించి ఎవరూ మాట్లాడద్దు అంటూ ఒక కీలక నాయకుడు సూచించారు. దీంతో సాయి రెడ్డి లేని లోటు ఆయన పాత్ర వంటివి బలమైన ముద్రవేశాయి అనేది స్పష్టంగా కనిపించింది, మరి భవిష్యత్తులో ఈ పోస్టును ఎవరితోనైనా భర్తీ చేస్తారా లేకపోతే అలాగే వదిలేస్తారా అనేది వేచి చూడాలి, లేక‌పోతే సాయిరెడ్డే వ‌స్తారో చూడాలి.