ఇక ‘అఖండ’ అమరావతి

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ఇప్పటిదాకా కొనసాగుతున్నది ఒక ఎత్తు అయితే… ఇకపై కనిపించనున్నది మరో ఎత్తు. ఇకపై కనిపించనున్న అమరావతిని నిజంగానే అఖండ అమరావతిగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే… మొన్నటిదాకా కేవలం 36 వేల ఎకరాల్లోనే అమరావతి నిర్మాణం జరుగుతుందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పుడు అదే చంద్రబాబు అమరావతి కోసం మరో 44వేల ఎకరాలను సేకరిస్తున్నామని చెప్పారు. అందుకు అవసరమైన కేబినెట్ అనుమతిని కూడా ఇచ్చేశారు.

మంగళవారం చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో సమావేశమైన ఏపీ కేబినెట్ సమావేశం అమరావతి ల్యాండ్ పూలింగ్ యాక్ట్- 2025కు ఆమోదం తెలిపింది. అంటే… రాజధాని నిర్మాణం, రాజధాని ఇతరత్రా అవసరాల కోసం ఇదివరకే సేకరించిన 36 వేల ఎకరాలకు అదనంగా ఇప్పుడు మరో 44 వేల ఎకరాల సేకరణకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టే కదా. ఈ లెక్కన ఈ రెండు భూ సమీకరణలను కలుపుకుంటే..మొత్తంగా 80 వేల ఎకరాల విస్తీర్ణంలో అఖండ అమరావతి నిర్మాణం కానుంది.

వాస్తవానికి 36 వేల ఎకరాల్లోనే రాజధాని నిర్మాణం అని 2014 తర్వాత నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు చెప్పారు. ఆ మేరకే 36 వేల ఎకరాలను మాత్రమే సేకరించారు. అందులో పనులూ మొదలుపెట్టారు. సింగపూర్ కన్సాన్షియమ్ తో ఒప్పందాలు చేసుకుని డిజైన్లు కూడా ఖరారు చేశారు. శాశ్వత భవనాల నిర్మాణం అయ్యేదాకా తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు భవనాలను నిర్మించారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో జనం జగన్ కు ఓటేశారు. జగన్ మాత్రం రాజధానిపై మాట మార్చి అమరావతి పనులను ఎక్కడికక్కడ నిలిపివేశారు.

తాజాగా 2024 ఎన్నికల్లో రికార్డు విక్టరీతో కూటమి అదికారంలోకి రాగా.. చంద్రబాబు మరోమారు సీఎం అయ్యారు. చంద్రబాబు సీఎం కాగానే… డ్రోన్ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్ టెక్నాలజి తదితరాలన్నీ అందుబాటులోకి వచ్చేశాయి. అంతేకాకుండా చంద్రబాబును చూసి బడా పారిశ్రామికవేత్తలు ఏపీకి క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని 36 వేల ఎకరాల్లో కట్టే అమరావతి సరిపోదని భావించిన కూటమి సర్కారు.. మరో 44 వేల ఎకరాల సేకరణ చేపట్టాలని తీర్మానించింది. ఈ ప్రతిపాదనకు కేబినెట్ కూడా ఆమోదం తెలపడంతో ఇక అఖండ అమరావతి సాక్షాత్కరించనుంది.