తెలంగాణకూ పాకిన జగన్ ‘రప్పా రప్పా’.. కానీ?

టాలీవుడ్ హిట్ మూవీ పుష్ప 2 సినిమాలోని రప్పా రప్పా డైలాగు బాగానే పేలింది. ఆ డైలాగు ఇప్పుడు తెలుగు నేల రాజకీయాల్లో తెగ వైరల్ అవుతోంది. ఏపీలో ఏకంగా అధికార, విపక్షాల మధ్య మాటల మంటలనే రాజేసింది. అరెస్టుల దాకా ఈ వ్యవహారం వెళ్లింది. మొన్నటి జగన్ రెంటపాళ్ల పర్యటనలో ఈ ప్లకార్డును పట్టిన వైసీపీ కార్యకర్తను అరెస్టు చేసిన ఏపీ పోలీసులు అతడిని రిమాండ్ కు తరలించారు. ఏపీలో రాజకీయ మంటలు రేపిన ఈ రప్పా రప్పా ప్లకార్డు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోకీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఏపీలో మాదిరిగా హార్డ్ కోర్ వ్యాఖ్యలు లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

శనివారం బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు పటాన్ చెరు పరిధిలోని జిన్నారంలో రైతుల తరఫున ధర్నాకు దిగారు. ఈ ధర్నాకు హాజరైన ఓ బీఆర్ఎస్ కార్యకర్త రప్పా రప్పా డైలాగు రాసి ఉన్న ప్లకార్డును పట్టుకుని ప్రదర్శించాడు. అయితే ఈ ప్లకార్డులో రప్పా రప్పా… 3.0 లోడింగ్ అని మాత్రమే ఉంది. అయినా హరీశ్ రావు వివాదాలకు తెర తీసే ప్లకార్డులను గానీ వ్యాఖ్యలను గానీ అనుమతించరు కదా. ఈ ప్లకార్డులో అలాంటి వ్యాఖ్యలేమీ కనిపించని నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. 

మొన్నటి జగన్ రెంటపాళ్ల పర్యటనలో భాగంగా పోలీసులు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చినా వైసీపీ శ్రేణులు వాటిని ధిక్కరించి మరీ రెంటపాళ్లకు పోటెత్తాయి. ఈ సందర్భంగా ఓ కార్యకర్త పుష్ప సినిమాలోనూ పూర్తి డైలాగును రాసి మరీ తాము అధికారంలోకి వస్తే తలలు నరికేస్తాం అంటూ సంచలన వాక్యాలు రాసి ప్రదర్శించాడు. ఆ మరునాడు దీనిపై మీడియా ప్రశ్నించగా… సినిమా డైలాగును రాసుకుంటే… చెబితే తప్పేముందబ్బా అంటూ జగన్ ఆ ప్లకార్డును సమర్థించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా చేయొచ్చంటూ కలరింగ్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ఏపీలో రాజకీయ చిచ్చును రేపాయి.