ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ఆయన ఎంతో ఆసక్తి కనబరిచి.. ఆహ్వానించిన ప్రతిష్టాత్మక సంస్థ కాగ్నిజెంట్ టెక్ సొల్యూషన్స్.. త్వరలోనే ఏపీకి రానుంది. ఈ మేరకు తాజాగా తన సమ్మతిని తెలుపుతూ.. మంత్రి నారా లోకేష్కు సమాచారం అందించింది. కాగ్నిజెంట్ టెక్ సొల్యూసన్స్ అనేది అమెరికాకు చెందిన కీలక సంస్థ. దీని ప్రధాన కార్యాలయం వాషింగ్టన్లో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టుబడులు పెడుతోంది.
ఈ నేపథ్యంలో కాగ్నిజెంటును రాష్ట్రానికి రావాలంటూ.. కొన్నాళ్ల కిందట మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆ సంస్థ ప్రతినిధులతో ఆయన రెండు సార్లు భేటీ అయ్యారు. రాష్ట్రంలో సంస్థను ఏర్పాటు చేయాలని, అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో విశాఖలోని కాపులుప్పాడ ప్రాంతంలో దాదాపు 21.5 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. దీనిని ఏడాదికి ఎకరాకు రూ.0.99 కే కేటాయించారు.
ఈ ప్రతిపాదనల తర్వాత.. స్థానికంగా విచారణ చేసుకున్న సంస్థ.. తాజాగా ఏపీకి వచ్చేందుకు సమ్మతించింది. విశాఖపట్నంలో ఐటీ క్యాంపస్ ఏర్పాటుకు సమ్మతి తెలిపింది. తొలి దశలో 1,582 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. దీనివల్ల దాదాపు 8 వేల మందికి పైగా యువతకు ఉద్యోగాలు లభించనున్నాయి. స్థానికంగా మరిన్ని రెట్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ప్రపంచ స్థాయి ఐటీ క్యాంపస్ ఏర్పాటు కానుండడంతో విశాఖ కీర్తి ప్రపంచ దేశాలకు పాకనుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates