హైదరాబాద్ కు మరో మణిహారం.. జీఎస్ఈసీ ప్రారంభం

భాగ్య నగరి హైదరాబాద్ ఐటీలో దూసుకుపోతోంది. నాడు టీడీపీ అధినేత, ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వేసిన ఐటీ అడుగులు… ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచంలోని దాదాపుగా అన్ని ఐటీ దిగ్గజాల కార్యాలయాలు హైదరాబాద్ లో ఉన్నాయి. తాజాగా భాగ్యనగరిలో మంగళవారం గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ) ఓపెన్ అయిపోయింది. దీనిని సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు ప్రారంభించారు.

ఇప్పుడు హైదరాబాద్ లో ఏర్పాటు అయిన జీఎస్ఈసీ కి ఓ ప్రత్యేకత ఉంది. గూగుల్ ఈ తరహాలో జీఎస్ఈసీ లు ప్రపంచంలో మరికొన్ని చోట్ల ఉండవచ్చు గానీ…ఆసియా ఫసిపిక్ ప్రాంతంలో మాత్రం హైదరాబాద్ సెంటరే మొదటిది. ఇప్పటికే గూగుల్ తన విస్తరణకు హైదరాబాద్ ను కీలక స్థావరంగా పరిగణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కారణంగానే ఆసియా ఫసిపిక్ ప్రాంతంలో ఏ కొత్త కేంద్రాన్ని ప్రారంభించాలన్నా… గూగుల్ తన తొలి ప్రాధాన్యాన్ని హైదరాబాద్ కే ఇస్తోంది.

1990 దశకంలో ఐటీలో అప్పుడప్పుడు బుడిబుడి అడుగులు ప్రారంభించిన హైదరాబాద్ కు గూగుల్, మైక్రోసాఫ్ట్ చాలా కంపెనీలు చంద్రబాబు కృషితో క్యూ కట్టాయి. అప్పటిదాకా కొండలు, గుట్లతో కూడిన సైబరాబాద్ ఈ ఐటీ కంపెనీల రాకతో సర్వాంగ సుందరమైన నగరంగా ఆవిర్భవించింది. ఐటీ రంగంలో విదేశీ సంస్థలే హైదరాబాద్ కు క్యూ కడుతున్న నేపథ్యంలో దేశీయ ఐటీ దిగ్గజాలు కూడా హైదరాబాద్ ను గమ్యస్థానంగా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తాాజాగా ఇప్పుడు జీఎస్ఈసీ హైదరాబాద్ లో ఏర్పాటు కావడంతో నగరానికి మరింత ప్రాధాన్యం దక్కిందని చెప్పక తప్పదు.