పోలవరాన్ని బానకచర్లతో అనుసంధానం చేయడం ద్వారా ఏపీ రూపురేఖలే మారిపోతాయన్నది సాగునీటి రంగ నిపుణులు ఘంటాపథంగా చెబుతున్న మాట. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణులు నిజంగానే ఈ ప్రాజెక్టు అద్భుతమని, ఇది పూర్తి అయితే గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో పాటు రాయలసీమ రతనాల సీమగా మారిపోతుందని చెబుతున్నారు. ఏపీకి వరప్రదాయనిగా పరిగణిస్తున్న ఈ ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం తన కసరత్తును మంగళవారం ప్రారంభించింది.
ఏపీ ప్రతిపాదిస్తున్న ఈ ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఆధ్వర్యంలోని నిపుణుల అంచనాల కమిటీ (ఈఏసీ) మంగళవారం దేశ రాజధాని ఢిల్లీలో భేటీ అయ్యింది. కొందరు నిపుణులు వర్చువల్ గా ఈ భేటీకి హాజరయ్యారు. పోలవరం-బానకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతుల విషయంపైనే ఈ కమిటీ దృష్టి సారించనుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు ద్వారా ఏ మేర పర్యావరణానికి నష్టం కలుగుతుంది? దాని ద్వారా ఏ మేర ప్రయోజనం కలుగుతుంది? అంతిమంగా ఈ ప్రాజెక్టు అనుమతులు ఇవ్వాలా? వద్దా? అన్న విషయాన్ని ఈ కమిటీ తేల్చనుంది. ఈ కమిటీ నుంచి ఒక్కసారి అనుమతి వచ్చిందంటే… ఇక బానకచర్ల ప్రాజెక్టు పరుగులు పెట్టడం ఖాయమనే చెప్పాలి.
ఇదిలా ఉంటే… పోలవరం-బానకచర్ల ప్రాజెక్టుకు పొరుగు రాష్ట్రం తెలంగాణ అభ్యంతరాలు చెబుతోంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పై తన అభ్యంతరాలను తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలవనరుల శాఖకు ఓ లేఖ కూడా రాశారు. మంగళవారం నాటి కేంద్ర కమిటీ సమావేశంలో ఈ లేఖ కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అసలు ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు వచ్చే నష్టమేంటి? తెలంగాణ వాదనలో నిజమెంత? అన్న అంశాలపై కమిటీ క్షుణ్ణంగా పరిశీలన చేపట్టనుంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు కారణంగా ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం వాటిల్లదు కదా అన్న దిశగానూ కమిటీ సభ్యులు ఇప్పటికే ఓ అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం.
వాస్తవానికి ఏ నదిపై అయినా ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడితే… తమకు ఎక్కడ నీరు అందదన్న ఆందోళనతో దిగువ రాష్ట్రాలు ఆందోళనకు గురవుతాయి. కేంద్రాన్ని ఆశ్రయిస్తాయి. ఎగువ రాష్ట్రాల ఆగడాలను అడ్డుకోవాలని వేడుకుంటాయి. అయితే అటు గోదావరిని చూసినా, ఇటు కృష్ణాను చూసినా దిగువ రాష్ట్రం ఏపీనే. ఈ లెక్కన ఏపీ ఏ ప్రాజెక్టులు, ఎన్ని ప్రాజెక్టులు కట్టినా కూడా ఎగువ రాష్ట్రాలకు అభ్యంతరాలే ఉండకూడదు. ఇక ఈ ప్రాజెక్టుకు సంబందించి సముద్రంలోకి వృథాగా కలుస్తున్న నీటిని వాడుకోవడమే తమ లక్ష్యమని ఏపీ చెబుతోంది. ఇలా ఏ అంశాన్ని చూసినా పోలవరం-బానకచర్ల ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడం ఖాయమన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates