తండ్రి మాదిరే అన్నకూ కవిత మద్దతు!

రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చెప్పడం చాలా కష్టం. నిన్న ఓ మాట మాట్లాడే నేతలు..ఆ మరునాడే దానికి పూర్తిగా విరుద్ధమైన ప్రకటన చేస్తూ ఉంటారు. ఈ లెక్కన ఏ నేత విషయంలో అయినా ఆయా నేతలు ఈ రోజు ఏం మాట్లాడారనే దానికే విలువ ఉంటుంది తప్పించి…గతంలో వారేం మాట్లాడారన్న దానికి అసలు విలువే లేదని చెప్పక తప్పదు. ఈ కోవలోకి ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా చేరిపోయారు.

తన తండ్రి కేసీఆర్ కు రాసిన లేఖ బయటకు రావడంతో ఈ పని తన సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆమె పరోక్షంగా టార్గెట్ చేశారు. కేటీఆర్ పేరు ఎత్తకుండానే ఆయనను ఏకంగా దెయ్యం అంటూ ఆమె ఘాటుగానే విమర్శించారు. అదంతా గతం. ఇప్పుడు ఫార్ములా ఈ కారు రేసుల కేసులో మరోమారు తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ ఏసీబీ అధికారులు కేటీఆర్ కు శుక్రవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై స్పందించిన కవిత…తన అన్నను వెనకేసుకుని రావడమే కాకుండా మద్దతుగా నిలిచారు.

“రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో బాగంగానే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్ సర్కారు మళ్లీ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు ఎన్ని కుట్రలు పన్నినా… మీ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతాం” అని కవిత ఓ రేంజిలో స్పందించారు. ఈ స్టేట్ మెంట్ చూస్తుంటే… కేటీఆర్ విచారణకు హాజరు కావడానికి ఇంకేమాత్రం కాస్త అధిక సమయం దొరికినా… కవిత హైదరాబాద్ లో భారీ నిరసన కార్యక్రమాన్నే చేపట్టి ఉండేవారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.

వాస్తవానికి అన్నాచెల్లెళ్ల మధ్య గత కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. వాటిని పరిష్కరించే బాధ్యతను పార్టీ ఏ ఒక్క నేత కూడా తీసుకోవడం లేదు. కేసీఆర్ కూడా ఈ విషయాన్ని అంతగా పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్ కు నోటీసులు రావడం, ఆ నోటీసులపై ఓ రేంజి ఫైర్ అవుతూ కవిత స్పందించడం, నిరసన చేపట్టే అవకాశం ఉంటే గనుక… అన్నాచెల్లెళ్ల మధ్య విభేదాలు కాస్తైనా తగ్గేవేమోనన్న విశ్లేషణలు అయితే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. చూద్దాం… మరి ఏం జరుగుతుందో?