ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీల నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క జగన్ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం తాలూకు నష్టాన్ని పూడ్చుకుంటూ…మరోపక్క సంక్షేమ పథకాలు అమలు చేయడంపై సీఎం చంద్రబాబు ఫోకస్ చేశారు. ఈ క్రమంలోనే తాజాగా మరో హామీపై చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు.
తల్లికి వందనం పథకంలో భాగంగా రేపు పిల్లల తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఇంట్లో అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి 15 వేల రూపాయలు చొప్పున నిధులు రేపు విడుదల చేయనున్నారు. ఒక్కొక్క విద్యార్థికి 15 వేల రూపాయలు చొప్పున వారి తల్లి బ్యాంకు ఖాతాలో జమ కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా రేపు తల్లులకు కానుకగా తల్లికి వందనం పథకం ప్రారంభించాలని చంద్రబాబు నిర్ణయించారు.
ఈ పథకం ద్వారా 67,27,164 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం అమలు కోసం తల్లుల ఖాతాల్లో రూ. 8,745 కోట్లు చంద్రబాబు సర్కార్ జమ చేయనుంది. ఏపీలో రేపటి నుంచి విద్యా సంవత్సరం మొదలుకానున్న సంగతి తెలిసిందే. వేసవి సెలవుల తర్వాత జూన్ 12న రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఫీజులు బెడద లేకుండా మొదటి రోజే తల్లికి వందనం పథకం అమలు చేయాలని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు.
చంద్రబాబు తీసుకున్న నిర్ణయం పట్ల పిల్లలు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల ప్రారంభం కానున్న మొదటి రోజే ఫీజు చెల్లించడంతో తాము చీకు చింత లేకుండా చదువుకుంటామని పిల్లలు అంటున్నారు. ఈ పథకం సరైన సమయంలో అమలు చేస్తున్న చంద్రబాబుకు పిల్లలు , వారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలుపుతున్నారు.