అమరావతిలో మహిళలపై సాక్షి టీవీలో జరిగిన చర్చ.. ఈ సందర్భంగా వ్యాఖ్యాతగా ఉన్న కృష్ణంరాజు చేసిన తీవ్ర వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉద్యమిస్తున్నారు. ఈ వేడి తగ్గకపోగా.. మరింత పెరుగుతోంది. తాజాగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సీరియస్ అయ్యారు. “ఆ వ్యాఖ్యలు చేసిన వాళ్లు కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్లే కదా!” అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును అమరావతి మహిళలు కలిశారు. ఆయనకు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ప్రెస్ కౌన్సిల్ చైర్మన్ గా పనిచేసిన కొమ్మినేని.. జర్నలిస్టులకు విధివిధానాలు నేర్పాల్సిన వ్యక్తి ఇలా జర్నలిజం విలువలు మర్చిపోయాడని వ్యాఖ్యానించారు. కృష్ణంరాజు అనే నీచుడు నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంటే వెక్కిలి నవ్వులు నవ్వుతూ.. అలా సపోర్ట్ చేయడం అనేది తీవ్రమైన చర్యగా పేర్కొన్నారు.
“రెండు రోజుల నుంచి చూస్తున్నాం మహిళా లోకం ఉవ్వెత్తున తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే డిజిపి కి లేఖ రాశా. బిజెపికి తగు చర్యలు తీసుకోవాలని తెలియపరిచా. నాకైతే విశ్వాసం ఉంది రాబోయే 24 గంటల్లో వాళ్ళని అరెస్ట్ చేస్తాం అని ముఖ్యమంత్రి కూడా ట్విట్టర్ లో గట్టిగా చెప్పారు. అమరావతి పై ముందు నుంచే విష్ప్రచారం చేశారు. గతంలో మాట్లాడిన దానికంటే ఇప్పుడు రాష్ట్రంలో పరాకాష్టకు చేరింది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తే చెప్పు తీసుకొని కొడతారు.” అని రఘురామ వ్యాఖ్యానించారు.
అంతేకాదు.. లక్ష్మీపార్వతిని ఎవడో ఒక మాటంటే సాక్షిలో కట్ చేశాడని, సాక్షిలో ప్రసారం అయితే సాక్షికి సంబంధం లేదు అంటే ఎవరూ ఊరుకుంటారని ప్రశ్నించారు. సాక్షి యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకుంటే సాక్షికి సంబంధం లేదు అనుకునేవాళ్లమని వ్యాఖ్యానించారు. “వాళ్లు కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్లే కదా. మహిళల గురించి ఎలా మాట్లాడుతారు?. వాళ్ళు తాలూకా వాళ్లే ఓ ఇంగ్లీష్ పేపర్లో రాయటం. అది పేపర్లో వచ్చిందని ఈ పనికిమాలిన వాళ్లు ప్రసారం చేయటం. ఇదంతా రాజధానిపై బురదజల్లే ప్రయత్నం.” అని రఘురామ అన్నారు.