=

మాగంటి పార్థీవ దేహం వద్ద కేసీఆర్ కన్నీటిపర్యంతం

గుండెపోటు కారణంగా మూడు రోజుల పాటు జీవన పోరాటం చేసిన బీఆర్ఎస్ నేత, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మాగంటికి నివాళి అర్పించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మాగంటి ఇంటికి వచ్చారు. ఈ సందర్బంగా మాగంటి పార్థీవ దేహాన్ని చూసినంతనే కేసీఆర్ కన్నీటిపర్యంతం అయ్యారు. భావోద్వేగంతో కేసీఆర్ కన్నీరు పెట్టుకుని ఏడ్చేశారు.

ఆ తర్వాత కాస్తంత తమాయించుకున్న కేసీఆర్.. మాగంటి కుమారుడిని దగ్గరకు పిలుచుకుని మరీ భుజంపై చేయి వేసి ధైర్యంగా ఉండాలని చెప్పారు. మాగంటి మృతదేహం వద్ద కేసీఆర్ కన్నీరు పెట్టుకుని దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ కు ఉన్న అతికొద్ది మంది నమ్మకస్తుల్లో మాగంటి గోపీనాథ్ ఒకరు. కేసీఆర్ తరఫున కీలకమైన వ్యవహారాలను చక్కబెట్టే బాధ్యతలు తీసుకునే వారి జాబితాలో మాగంటి ఎప్పుడో చోటు దక్కించుకున్నారు.

టీడీపీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన మాగంటి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే… రాష్ట్ర విభజన పరిణామాలతో టీడీపీని వీడి బీఆర్ఎస్ లో చేరాల్సి వచ్చింది. టీడీపీలో ఏ స్థాయి ప్రాధాన్యతతో పనిచేశారో…బీఆర్ఎస్ లోనూ మాగంటి అంతే ప్రాధాన్యత కలిగిన బాధ్యతల్లో కొనసాగారు. బీఆర్ఎస్ లో చేరిన అనతి కాలంలోనే కేసీఆర్ గుడ్ లుక్స్ లో పడిపోయిన మాగంటి పార్టీలో ముఖ్య నేతగా ఎదిగారు. అలాంటి నేత మరణాన్ని చూసి కేసీఆర్ తట్టుకోలేకపోయారు. ఈ కారణంగా మాగంటి భౌతిక కాయాన్ని చూడగానే కేసీఆర్ కన్నీటిని ఆపుకోలేకపోయారు.