వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు వెనుకంజ వేసిన సంగతి తెలిసిందే. జగన్ విధ్వంసకర పాలన వల్ల భయపడిన ఐటీ కంపెనీలు మరియు ఇతర పరిశ్రమలు రాష్ట్రానికి రావడానికి మొహమాటపడాయి. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, బీజేపీ, జనసేన కూటమి గెలిచిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే, ఆయన బ్రాండ్ ఇమేజ్ చూసి పెట్టుబడిదారులు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ఐటీ రంగ అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడింది. అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పార్క్ నిర్మాణానికి సంబంధించి ఎంఓయూలను ర్యాటిఫై చేస్తూ ప్రభుత్వం తాజాగా అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.
ఈ క్వాంటం పార్క్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. టీసీఎస్, ఎల్ అండ్ టీ, ఐబీఎం సంస్థలు ఈ పార్క్ అభివృద్ధిలో భాగస్వాములు. ఇందులో భాగంగా, ఐబీఎం సంస్థ 156 క్యూబిట్ క్వాంటం సిస్టమ్ 2 ను అమరావతిలో ఏర్పాటు చేయనుంది. టీసీఎస్ సంస్థ క్వాంటం కంప్యూటింగ్ సర్వీసులు, సొల్యూషన్స్, పరిశోధన, హైబ్రిడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీలు వంటి సేవలను అందించనుంది. ఇక ఎల్ అండ్ టీ సంస్థ క్లయింట్ నెట్వర్క్ స్టార్టప్ల నిర్వహణ, ఇంజనీరింగ్ స్టార్టప్లకు తగిన నైపుణ్య సహాయం అందించనుంది.
ఈ ప్రాజెక్టును 2026 జనవరి 1 నాటికి పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. క్వాంటం వ్యాలీ పార్క్తో అమరావతిలో వేలాదిమందికి ఐటీ ఉద్యోగాలు లభించనున్నాయి. దీనితో పాటు విశాఖపట్నంకు కూడా పలు ఐటీ సంస్థలు రావడానికి రంగం సిద్ధమవుతోంది.