ట్రంప్ ట్వీట్‌పై మామూలు ట్రోలింగ్ కాదు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గత పర్యాయం అనూహ్య విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. రెండోసారి గెలవబోడని ఎప్పట్నుంచో సంకేతాలు అందుతున్నాయి. మామూలుగానే ఆయన తీరు, పనితీరూ రెండూ సంతృప్తిగా లేకపోగా కరోనా వైరస్ మిణుకుమిణుకుమంటున్న ఆశల మీదా నీళ్లు చల్లేసింది. వైరస్‌ను డీల్ చేయడంలో ఘోరంగా విఫలమయ్యాడని అపప్రథ మూటగట్టుకున్న ట్రంప్ ఓటమి లాంఛనమే అనుకున్నారంతా. ఐతే ఉన్నంతలో పోటీ ఇవ్వగలిగాడు కానీ.. విజయం మాత్రం సాధించలేకపోయాడు.

ట్రంప్ ఓటమి ఖాయమని రెండు రోజుల ముందే సంకేతాలు అందాయి. చివరికి ఇప్పుడు అమెరికాకు చెందిన ప్రధాన మీడియా జో బైడెన్‌యే కొత్త అధ్యక్షుడని ధ్రువీకరించాయి. అమెరికానే కాదు.. ప్రపంచమంతా కూడా బైడెన్‌నే అధ్యక్షుడిగా గుర్తించింది. అయినా సరే.. ట్రంప్ మాత్రం పట్టు వీడట్లేదు. తన ఓటమిని జీర్ణించుకోలేదు. ముందు అన్నట్లే న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాడు. కానీ ఆ పనేదో చేసుకోకుండా తానే గెలిచానంటూ బల్లగుద్ది వాదిస్తూ వేసిన ట్వీట్ చూసి ప్రపంచవ్యాప్తంగా జనం నవ్వుకుంటున్నారు. “నేనే గెలిచా.. అది కూడా భారీ తేడాతో” అంటూ ట్విట్టర్లో ఆయన ఘనంగా ప్రకటించుకున్నారు. దాని మీద ట్విట్టర్లో ట్రోలింగ్ మామూలుగా జరగట్లేదు.

ట్రంప్ ఈ లోకంలో లేడని, ఎక్కడో విహరిస్తున్నాడని.. ఆ లోకంలో ఆయనే విజేత కావచ్చని నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ట్రంప్‌ను వైట్ హౌస్‌ నుంచి వెంటనే పిచ్చాసుపత్రికి తరలించాల్సిన సమయం వచ్చిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అయితే ఈ ట్వీట్ మీద భలే సరదాగా స్పందించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ ఈసారి ఐపీఎల్ గెలిచిందని, అది కూడా భారీ తేడాతో అని ట్రంప్‌ను వెటకారమాడుతూ ట్వీట్ వేశాడు. ఇక మన తెలుగు నెటిజన్లయితే బ్రహ్మానందం హావభావాలతో ట్రంప్ మీద కామెడీని ఓ రేంజిలో పండిస్తున్నారు.