=

తారా జువ్వ‌లా మోడీ గ్రాఫ్‌.. ఎలా ఎగ‌బాకిందంటే!

“ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ గ్రాఫ్ ఒక్క‌సారిగా ఎగ‌బాకింది. తారా జువ్వ‌లా దూసుకుపోయింది. మ‌నం ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో ఆయ‌న గ్రాఫ్ పుంజుకుంది.” -తాజాగా కేంద్ర మంత్రి ఒక‌రు వ్యాఖ్యానించారు. ఇది నిజమేన‌ని జాతీయ మీడియా కూడా పేర్కొంది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా మోడీ హ‌వా మ‌రింత పెరిగిన‌ట్టు క‌థ‌నాలు రాసుకొచ్చింది. సాధార‌ణంగా.. విశ్వ‌గురుగా పేరొందిన మోడీ.. ఇప్పుడు మ‌రింత పుంజుకున్నార‌నేది ఈ క‌థ‌నాల సారాంశం.

వాస్త‌వానికి ఏప్రిల్ 22న జ‌రిగిన ఉగ్ర‌వాద దాడి త‌ర్వాత‌.. ఒక నిస్తేజం అలుముకుంది. కానీ.. అంతలోనే తేరుకున్నారు. ఆ వెంట‌నే ఊహించ‌నివిధంగా ‘ఆప‌రేష‌న్ సిందూర్‌’ చేప‌ట్టారు. ఇది పాకిస్థాన్‌ను టార్గెట్ చేసుకుని చేసింది కాక‌పోవ‌డమే.. మోడీని ప్ర‌పంచ స్థాయిలో హీరోగా నిల‌బెట్టింద‌ని మీడియా పేర్కొంది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఉగ్ర‌వాదంపై ఎవ‌రికీ సానుభూతి లేదు. అలాంటి ఉగ్ర‌వాద స్థావ‌రాల‌నే మోడీ టార్గెట్ చేసుకున్నారు.

పాకిస్థాన్‌లోని ఉగ్ర‌వాద స్థావ‌రాలు, ఉగ్ర‌వాదుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని.. ఆప‌రేష‌న్ సిందూర్‌ను చేప‌ట్టారు. త‌ద్వారా ప్ర‌పంచానికి భార‌త్‌.. ఉగ్ర‌వాద ఏరివేత‌లో ఏమాత్రం రాజీపడ‌ని దేశంగా .. ప్ర‌ధాని మోడీని ధీరో దాత్తుడిగా నిల‌బెట్టింద‌న్నది అంత‌ర్జాతీయ మీడియా కూడా పేర్కొంది. ఇదొక యాస్పెక్ట్ అయితే.. ఇక‌, మ‌రొక‌టి.. తాజాగా ప్ర‌పంచ ఆర్థిక వృద్ధిలో భార‌త్‌.. 5వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎగ‌బాక‌డం. ఇది మ‌రింత కీల‌కంగా మారింది. త‌ర‌చుగా మోడీ.. భార‌త్ వృద్ధి చెందుతోంద‌ని.. త్వ‌ర‌లోనే 3వ స్థానానికి చేరుకుంటుంద‌ని చెబుతున్నారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా భార‌త్ ప్ర‌పంచ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో జ‌పాన్‌ను ప‌క్క‌కు నెట్టి.. 4వ స్థానానికి చేరింది. ఇదికూడా.. మోడీ తీసుకున్న నిర్ణ‌యాలు.. పాల‌నా ద‌క్ష‌త‌కు నిద‌ర్శ‌న‌మ‌ని.. జాతీయ‌, అంత‌ర్జాతీయ మీడియా కూడా(కొన్ని) కొనియాడింది. ఇక‌, ఎప్ప‌టిక‌ప్పుడు పాల‌కుల గ్రాఫ్‌ల‌ను అంచ‌నావేసే.. ఇండియా టుడే.. తాజాగా మోడీ గ్రాఫ్ అంత‌ర్జాతీయంగా పుంజుకుంద‌ని.. పేర్కొంది. ప్ర‌పంచం యావ‌త్తు.. ఇప్పుడు భార‌త్‌వైపే చూస్తోంద‌ని తెలిపింది.