=

వైసీపీ ద్వారంపూడి చుట్టూ వీర‌మ‌ల్లు వివాదం..!

వైసీపీ నాయ‌కుడు, ఫైర్ బ్రాండ్ నేత‌, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి చుట్టూ మ‌రో వివాదం ముసురుకుంది. తాజాగా ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ కల్యాణ్‌.. న‌టించిన హ‌రిహ‌ర వీర‌మ ల్లు సినిమా వ‌చ్చే నెల 12న విడుద‌ల‌కు రెడీ అయింది. ప్ర‌స్తుతం పోస్టు ప్రొడ‌క్ష‌న్ ప‌నులు సాగుతున్నాయి. అయితే.. ఈ సినిమా విడుద‌ల‌కు ముందు.. రాష్ట్రంలో సినిమా హాళ్ల బంద్ వ్య‌వ‌హారం తెర‌మీదికి వ‌చ్చింది.

జూన్ 1 నుంచి త‌మ స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కాక‌పోతే.. సినిమా హాళ్ల‌ను బంద్ చేస్తామ‌ని ఎగ్జిబిట‌ర్లు ప్ర‌క‌టిం చారు. ఇది వివాదంగా మారింది. ఆ వెంట‌నే జ‌న‌సేన మంత్రి కందుల దుర్గేష్‌.. విచార‌ణ‌కు ఆదేశిస్తున్న‌ట్ట ప్ర‌క‌టించారు. ఇలా సినిమా హాళ్ల బంద్ వెనుక‌.. న‌లుగురు వ్య‌క్తులు ఉన్నార‌న్న మంత్రి.. దీనిని ఎవ‌రు చేయిస్తున్నారో తెలుసుకుంటామ‌ని, చ‌ర్య‌లు కూడా తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. అయితే.. ఆ త‌దుప‌రి రోజే హైద‌రాబాద్‌లో భేటీ అయిన ఎగ్జిబిట‌ర్లు.. బంద్ లేద‌న్నారు.

అంటే.. జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు య‌ధావిధిగా ప‌నిచేయ‌నున్నాయి. అయితే.. అస‌లు వివాదానికి కార‌ణాలు.. ఆ నలుగురు ఎవ‌రు అనే విష‌యాల‌పై విచార‌ణ జ‌రిగి తీరుతుంద‌ని ప్ర‌భుత్వం తేల్చింది. ఇదిలావుంటే.. ఈ వ్య‌వ‌హారంలో ఆ న‌లుగురిలో ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఒక‌ర‌కంటూ.. నిర్మాత న‌ట్టి కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దీంతో ద్వారంపూడి ఉలిక్కి ప‌డ్డారు. త‌న‌కు ఆ న‌లుగురికి సంబంధం లేద‌ని.. తాను ఎక్క‌డా సినిమా హాళ్ల బంద్ కు ప్ర‌క‌ట‌న చేయ‌లేద‌న్నారు.

కానీ, న‌ట్టి కుమార్ మాత్రం ప‌దే ప‌దే ద్వారంపూడి పేరును ప్ర‌స్తావించారు. గ‌త ఏడాది ద్వారంపూడి రైసు మిల్లులు, బియ్యం ఎగుమ‌తుల‌పై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ కల్యాణ్ ఉక్కుపాదం మోపిన విష‌యం తెలిసిందే. దీనికి ప్ర‌తీకారంగానే ద్వారంపూడి ఇలా.. హాళ్ల‌ను బంద్ చేయించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌న్న ప్ర‌చారం జ‌న‌సేన‌లోనూ సాగుతోంది. అయితే.. దీనిలో త‌న ప్ర‌మేయంలేద‌ని ద్వారం పూడి ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు.. ప‌వ‌న్ క‌ల్యాణ్ బావ‌మ‌రిది, ప్ర‌ముఖ నిర్మాత‌.. అల్లు అర‌వింద్ కూడా.. ఆ న‌లుగురిలో తాను లేన‌ని ప్ర‌క‌టించారు. మ‌రి ఆ న‌లుగురు ఎవ‌రు? అనేది ఇప్పుడు చ‌ర్చగా మారింది. ఏదేమైనా ద్వారంపూడికి క‌నుక ఆ న‌లుగురితో సంబంధం ఉంటేక‌నుక తీవ్ర ప‌రిణామాలే ఉంటాయ‌ని ఆయ‌న అనుచురులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు.