=

వైసీపీ నేత పిన్నెల్లి సోద‌రుల‌పై మ‌ర్డ‌ర్‌ కేసు… ఏం జ‌రిగింది?

వైసీపీ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి, పిన్నెల్లి వెంక‌ట్రామిరెడ్డిల‌పై పోలీసులు హ‌త్య కేసు న‌మోదు చేశారు. సెక్ష‌న్ 302(మ‌ర్డ‌ర్ కేసు) కింద వీరిపై కేసు న‌మోదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఉమ్మ‌డి గుంటూరు జిల్లా ప‌ల్నాడులో శ‌నివారం మ‌ధ్యాహ్నం దారుణ హ‌త్య జ‌రిగింది. టీడీపీలోని రెండు వ‌ర్గాల మ‌ధ్య త‌లెత్తిన ఆధిప‌త్య పోరు.. ఈ హ‌త్య‌కు కార‌ణ‌మ‌ని పోలీసులు గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు టీడీపీ క్షేత్ర‌స్థాయి నాయ‌కులు ప్రాణాలు కోల్పోయారు.

ప‌ల్నాడు ప్రాంతంలోని మాచ‌ర్ల‌కు చెందిన వెంక‌టేశ్వ‌ర్లు, కోటేశ్వ‌ర‌రావులు అన్న‌ద‌మ్ములు. వీరు సుదీర్ఘ కాలంగా టీడీపీలో ఉన్నారు. ప్ర‌స్తుతం క్షేత్ర‌స్థాయి రాజ‌కీయాల‌ను వెంక‌టేశ్వ‌ర్లు చ‌క్క బెడుతున్నాడు. ఆయ‌న‌కు కోటేశ్వ‌ర‌రావు స‌హ‌క‌రిస్తున్నాడు. అయితే.. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు శ్రీను, వెంక‌ట్రావు లు.. వైసీపీ నుంచి టీడీపీలోకి వ‌చ్చారు. వారు ఇద్ద‌రూ కూడా.. పిన్నెల్లికి మద్ద‌తు దారులుగా ఉన్నార‌ని పోలీసులు చెబుతున్నారు.

అయితే.. క్షేత్రస్థాయిలో టీడీపీ రాజ‌కీయాల‌ను తామే నిర్వ‌హిస్తామంటూ.. శ్రీను, వెంక‌ట్రావులు గ‌త కొన్నాళ్లుగా యాగీ చేస్తున్నారు. కానీ, పార్టీ నుంచి వెంక‌టేశ్వ‌ర‌రావుకు మ‌ద్ద‌తు ఉంది. దీంతో పార్టీ కార్య‌క్ర‌మాల‌ను ఆయ‌నే చేస్తున్నారు. ఈ వ్య‌వ‌హారాన్ని శ్రీను, వెంక‌ట్రావులు జీర్ణించుకోలేక పోతున్నారు. పైగా.. త‌మ‌పై పెత్త‌నం చేస్తున్నార‌ని వెంక‌టేశ్వర్లు, కోటేశ్వ‌ర‌రావుపై అక్క‌సు పెంచుకున్నారు. శ‌నివారం ఈ ఇద్ద‌రు అన్న‌ద‌మ్ములు తెలంగాణ‌లో కార్య‌క్ర‌మానికి వెళ్లి.. తిరిగి గ్రామానికి చేరుకుంటున్నారు.

ఈ క్ర‌మంలో కాపు కాచి స్కార్పియో కారుతో వీరిద్ద‌రినీ గుద్ది చంపేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేప‌థ్యంలో వారితో పాటు.. వారిని ప్రోత్స‌హించి.. హ‌త్య‌కు పురికొల్పారంటూ.. పిన్నెల్లి సోద‌రుల‌పై కేసులు న‌మోదు చేశారు. కాగా, ఇప్ప‌టికే పిన్నెల్లిపై ఎన్నిక‌ల స‌మ‌యంలో పోలింగ్ బూత్‌లోకి ప్ర‌వేశించి ఈవీఎంల‌ను ధ్వంసం చేయ‌డం.. ఓట‌ర్ల‌పై దూష‌ణ‌ల‌కు దిగిన కేసు న‌డుస్తోంది. ఇప్పుడు ఏకంగా హ‌త్య కేసు న‌మోదైంది. వీరిని ఏ-6, ఏ-7లుగా పోలీసులు పేర్కొన్నారు.