తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా మహిళలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలతో ముంచెత్తారు. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో సంగారెడ్డి మహిళా మణులు దూకుడుగా ఉన్నారని.. వీరు దేశానికే ఆదర్శమని కొనియాడారు. వ్యవసాయ రంగంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డ్రోన్ల వినియోగాన్ని తెలంగాణలోని సంగారెడ్డి మహిళలు అందిపుచ్చుకున్నారని ప్రధాని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తుల రక్షణ, పురుగుల మందు పిచికారీ వంటి పనులను డ్రోన్లు చేస్తాయి.
ఈ సాంకేతికతను దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగానికి కేంద్ర ప్రభుత్వ సాయంతో అందిస్తున్నారు. అయితే.. దేశంలోనే మొదటి సారి భారీ సంఖ్యలో డ్రోన్లు వినియోగిస్తున్న మహిళలు ఎక్కువగా ఉన్న జిల్లాగా సంగా రెడ్డి గుర్తింపు పొందింది. ఈ విషయాన్నే ప్రధాని మోడీ తన మన్కీ బాత్లో ప్రసంగంలో పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ సారి.. ఆపరేషన్ సిందూర్ తర్వాత.. తొలిసారి మే 25న రావడంతో ప్రధాని ఎక్కువగా ఆపరేషన్ సిందూర్ పైనే ఫోకస్ చేశారు.
అయితే.. ఇదేసమయంలో తెలంగాణ మహిళలు సాధించిన విజయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇక, ఆపరేషన్ సిందూర్ విషయంలో దేశం మొత్తం కేంద్రం వెంటే నడిచిందని ప్రధాని అన్నారు. భారత సైనికులకు ఊరూ వాడా ప్రజలు మద్దతు తెలిపారని అన్నారు. తిరంగా యాత్రల ద్వారా.. సైనికులకు మద్దతు తెలిపారని..తద్వారా దేశం మొత్తం ఒక్కటే అన్న భావనను స్పష్టీకరించారని మోడీ చెప్పారు. ఉగ్రవాదాన్ని ఏ రూపంలో ఉన్నా సహించేది లేదన్నారు.
“ఉగ్రవాదనికి వ్యతిరేకంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆపరేషన్ సమయంలో జన్మించిన చిన్నారులకు పలువురు ‘సిందూర్’ అని పేరు పెట్టుకున్నారు. ఇది దేశాన్ని మరింత ఉత్తేజపరిచింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమైంది. నేడు ప్రతి భారతీయుడు ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. ఆపరేషన్ సిందూర్ కేవలం సైనిక చర్య మాత్రమే కాదు.. మన ధైర్యం, దేశభక్తితో నిండిన నవభారతానికి నిదర్శనం.”అని ప్రధాని మోడీ ఉద్ఘాటించారు.