ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆ పదవిని తీసుకుని.. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి 11 మాసాలు అయింది. ఈ పదకొండు మాసాల్లో కీలకమైన పలు కార్యక్రమాలను పవన్ కల్యాణ్ ఒంటరిగానే చేపట్టడం గమనార్హం. ఈ కార్యక్రమాలు కూడా.. సూపర్ హిట్ కొట్టడం మరో ముఖ్య వ్యవహారం. వీటిలో ప్రధానంగా పల్లె పండుగ, గ్రామ సభలు, అడవితల్లి బాట, మన వూరు మాటా-మంతి వంటివి ఉన్నాయి. వీటిని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం గమనార్హం.
పల్లె పండుగ: ఇది కీలకమైన గ్రామీణ ప్రాంతంలో అభివృద్ది బాటలు వేసేందుకు ఉద్దేశించిన పథకం. తద్వారా గ్రామాల్లోని రహదారులకు మోక్షం కల్పించాలన్నది పవన్ ఉద్దేశం. కేంద్రం అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని దీనికి అనుసంధానం చేయడం ద్వారా పవన్ కల్యాణ్ గ్రామాభ్యుదయానికి శ్రీకారం చుట్టారు. తద్వారా.. గ్రామాల్లో వెలుగు రేఖలు ప్రసరించేలా చేయడం గమనార్హం.
గ్రామ సభలు: గత ఏడాది ఒకే సారి రాష్ట్రంలోని 200 గ్రామాల్లో చేపట్టిన కార్యక్రమం. గ్రామ సభలు నిర్వ హించడం ద్వారా గ్రామీణుల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించే ప్రయత్నం చేశారు. తద్వారా గ్రామీణుల్లో నెలకొన్న నిరాశ, నిస్పృహలను పారదోలే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్రమానికి రికార్డుకూడా దక్కించుకున్నారు. సీఎం నుంచి అధికారుల వరకు అందరూ పాల్గొన్నారు.
అడవితల్లి బాట: ఇది మన్యం ప్రాంత గిరిజనులను ఉద్దేశించిన కీలక కార్యక్రమం. ఈ ఏడాది ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని పవన్ కల్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అడుగులు వేశారు. గిరిజన ప్రాంతంలో రహదారులు నిర్మించడం ద్వారా.. వారి డోలీ మోతలను తప్పించడంతోపాటు.. స్వచ్ఛమైన తాగునీరు, ఇతర మౌలిక సౌకర్యాలను అందించే కీలక కార్యక్రమం.
మాటా మంతీ: తాజాగా పవన్ కల్యాణ్.. నిర్వహించిన మన వూరు మాటా మంతీ కార్యక్రమం కూడా గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలను వర్చువల్గా విని.. వాటిని పరిష్కరించే ప్రయత్నం చేయడం. అంతేకాదు.. సినిమా హాల్లో వెండితెర వేదికగా.. పవన్ కల్యాణ్ వారితో సంభాషించి.. వారికి భరోసా ఇచ్చే కార్యక్రమం ద్వారా.. గ్రామీణుల్లో భరోసా నింపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మొత్తంగా ఈ 11 మాసాల్లో పవన్ కల్యాణ్ సొంతగా ప్రారంభించిన ఈ పథకాలు.. గ్రామీణ చరిత్రను మార్చే ప్రయత్నంలో భాగమేనని చెప్పాలి.