ఎక్కడ విన్నా.. ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా.. వైసీపీ అధినేత జగన్ చుట్టూనే చర్చ జరుగుతోంది. ఆయన అరెస్టు అవుతారా? ఆయనను జైలుకు పంపిస్తారా? అనేదే ఇప్పుడు ప్రతి ఒక్కరిలోనూ నెల కొన్న ఉత్కంఠ . ప్రస్తుత ప్రభుత్వం వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని.. వేలాది కోట్ల రూపాయలను ముడుపులుగా పుచ్చుకుని దారిమళ్లించారని కూడా చెబుతోంది. ఈ క్రమంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి మరీ విచారణకు ఆదేశించింది.
దీంతో ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు ఇప్పటికే పలువురిని కీలక నిందితులుగా పేర్కొంటూ.. వారిని అరెస్టు చేసింది. వీరి నుంచి కీలక సమాచారాన్ని కూడా రాబడుతున్నారు. మొత్తంగా చూస్తే.. ఈ కేసులో నిధులు ఎటు దారిమళ్ళాయి? ఎవరికి ఇచ్చారు? అనే కోణంలోనే విచారణ ముందుకు సాగుతోంది. మరీ ముఖ్యంగా అంతిమ లబ్ధిదారు
ఎవరు? అనే విషయాన్ని తేల్చే పనిలో ఉన్నారంటూ.. మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి.
ఆ అంతిమ లబ్ధిదారు ఎవరు? అనే విషయంపై టీడీపీ నాయకులు పలు టీవీ డిబేట్లలో పేరును నేరుగానే చెబుతున్నారు. జగన్కే నిధులు చేరాయని అంటున్నారు. దీంతో లిక్కర్ కుంభకోణంలో జగన్ను అరెస్టు చేయడం ఖాయమన్న చర్చ జోరుగా సాగుతుండడం గమనార్హం. ఇక, ప్రభుత్వ పరంగా చూసుకుంటే.. జగన్ అరెస్టుతో సర్కారుకు ఇప్పటికిప్పుడు వచ్చే నష్టం లేదన్న చర్చ కూడా ఉంది. ఎన్నికలకు ముందు అరెస్టు చేస్తే.. జగన్ ను అరెస్టు చేశారన్న సానుభూతి వస్తుందని.. కానీ, ఇప్పుడు అరెస్టు చేస్తే ఇంకా నాలుగేళ్ల సమయం ఉందని లెక్కలు వేసుకుంటున్నారు.
ఇదే జరిగితే.. ప్రజల్లో సానుభూతి ఇప్పుడు వచ్చినా.. అది ఎన్నికలు జరిగే నాలుగేళ్ల వరకు ఉండదని ప్రభుత్వ పెద్దలు అంచనా వేసుకుంటున్నారు. కాబట్టి జగన్ అరెస్టుకు మార్గం ఉందన్న చర్చ వినిపిస్తోంది. కానీ.. చంద్రబాబు వంటి సీనియర్ నాయకుడు.. ప్రతిపక్ష నేతను అరెస్టు చేయించే పరిస్థితి ఉంటుందా? అలా చేసి.. మీడియాలో ఆయన ప్రముఖంగా నిలబడతారా? అంటే.. అది కూడా క ష్టమే. కానీ, కేసును మాత్రం ముందుకు తీసుకువెళ్లి.. జగన్ను ప్రజల మధ్య దోషిగా అయితే.. నిలబెట్టడం ఖాయమని తెలుస్తోంది. తద్వారా.. సానుభూతిని మరింత తగ్గించే ప్రయత్నాలు చేస్తారని అంటున్నారు.