ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మేజర్ మల్ల రామ గోపాల్ నాయుడు భారత సైన్యం అందించే అత్యున్నత పురస్కారాల్లో రెండోదైన కీర్తి చక్రతో మెరిశారు. కీర్తి చక్రతో మెరవడమే కాదండోయ్.. ఈ గ్యాలంట్రీ అవార్డును అందుకున్న తొలి తెలుగు రైతు బిడ్డ కూడా మన నాయుడే కావడం గమనార్హం. భారత స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఏటా సైనికులు ఇచ్చే గ్యాలంట్రీ అవార్డులను ఈ ఏడాదికి సంబందించి గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. మొత్తం 4 కీర్తి చక్ర అవార్డులను ముర్ము అందజేయగా.. ముగ్గురు అదికారులు వీర మరణం పొందాక అందుకుంటే…మన నాయుడు మాత్రం స్వయంగా ముర్ము చేతుల మీదుగా అవార్డును అందుకుని సగర్వంగా నిలిచారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామానికి చెందిన సన్నకారు రైతు అప్పలనాయుడు కుమారుడైన నాయుడికి చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరాలని తాపత్రయపడేవారట. అందుకు అక్కడికి సమీపంలోని కోరుకొండ సైనిక స్కూల్ ఆయనకు ఎంతగానో ప్రోత్సాహం ఇవ్వగా… కోరుకొండ సైనిక్ స్కూల్ లో విద్యాభ్యాసాన్నిపూర్తి చేసి 2012లోనే నేషనల్ డిఫెన్స్ అకాడెమీ (ఎన్డీఏ) పరీక్ష ద్వారా నాయుడు భారత సైన్యంలోకి ఎంట్రీ ఇచ్చారు. డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడడెమీ నుంచి గోల్డ్ మెడల్ తో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం ఇండియన్ ఆర్మీలో లెఫ్ట్ నెంట్ హోదాలో అడుగుపెట్టిన నాయుడు… 2022 నాటికి మేజర్ హోదాను పొందారు.
ప్రస్తుతం 56 రాష్ట్రీయ రైఫిల్స్ లోని మరాఠా లైట్ ఇన్ ఫాంట్రీలో మేజర్ హోదాలో పనిచేస్తున్న నాయుడు… జమ్ము కశ్మీర్ లోని కుప్వారాలో నియంత్రణ రేఖ వెంట ఉగ్రావాదులను మట్టుబెట్టే విషయంలో అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శించారు. 2023లో జరిగిన ఈ ఆపరేషన్ లో నాయుడు సాహసోపేతమైన చర్యలతో ఉగ్రవాదులు హతం అయిన విషయాన్ని గుర్తించిన సైనికాధికారులు ఆయనకు కీర్తి చక్ర అవార్డు ఇవ్వాలంటూ భారత ప్రభుత్వానికి సిఫారసు చేశారు. ఈ సిఫారసులను పరిశీలించిన భారత ప్రభుత్వం ఈ ఏడాదికి సంబంధించి 11 శౌర్య చక్ర అవార్డులతో పాటు 4 కీర్తి చక్ర అవార్డులను ప్రకటించింది. అఈ 4 కీర్తి చక్ర అవార్డుల్లో మన నాయుడుకు ఒకటి దక్కింది.
2023లో కుప్వారాలో ఏం జరిగిందన్న విషయానికి వస్తే… ఆ ఏడాది అక్టోబర్ 26 ఉదయం నాయుడు క్యాంపునకు సమీపంలో ఉగ్రవాదులు తచ్చాడుతున్నట్లుగా సమాచారం అందింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా మేజర్ నాయుడు నేతృత్వంలో మరాఠా లైట్ ఇన్ ఫాంట్రీ బెటాలియన్ తో పాటు 56 రాష్ట్రీయ రైఫిల్స్ సైనికులు రంగంలోకి దిగిపోయారు. ఉగ్రవాదులు కంటబడినంతనే తన బృందానికి నాయకత్వం వహిస్తున్న నాయుడు… నాయకుడి మాదిరే అందరి కంటే ముందు కదిలారు. ఉగ్రవాదులను చీల్చిచెండాడుతూ కదిలారు.
ఈ క్రమంలో ఇద్దరు ఉగ్రవాదులు తమకు సమీపంలోని ఓ గుహలో దాక్కోగా… తన బృందాన్ని సేఫ్ మోడ్ లోనే ఉంచి ఉగ్రవాదులపైకి నాయుడు లంఘించారు. తమపైకి సింహంలా దూకుతూ వస్తున్న నాయుడును చూసి ఉగ్రవాదులు గ్రెనేడ్లను విసిరారు. అయినా కూడా నాయుడు ఏమాత్రం వెనుకాడలేదు. గ్రెనేడ్లను తప్పించుకుంటూ… ఏదో సినిమాల్లో హీరోల మాదిరిగా ముందుకు దూసుకుపోయారు. ఉగ్రవాదులకు పాయింట్ బ్లాంక్ రేంజిలోకి చేరిన నాయుడు… ఇద్దరిలో ఓ ఉగ్రవాదిని మట్టుబెట్టగా… తమ నాయకుడి వెంటే వచ్చిన ఇన్ ఫాంట్రీ సైనికులు మరో సైనికుడిని మట్టుబెట్టారు. ఈ ఆపరేషన్ లో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులను హతం చేసిన నాయుడు బృందం దేశ భద్రతలో తమ వంతు కృషిని చేసింది.