సారు ఈ సారి బోను ఎక్కక తప్పదా..?

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాక చంద్రఘోష్ కమిషన్ కాల పరిమితి మరో రెండు నెలలు పెరిగింది. ఈ మేరకు కమిషన్ కాలపరిమితిని జూలై చివరి దాకా పొడిగిస్తూ రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం, తదనంతర పరిణామాలు చూస్తుంటే… కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన సీఎంగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకున్న బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) కమిషన్ విచారణకు హాజరు కాక తప్పదా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి. విచారణకు హాజరు కావాలంటూ కేసీఆర్ తో పాటు హరీశ్ రావు, ఈటెల రాజేందర్ లకు కమిషన్ మంగళవారం నోటీసులు జారీ చేసింది.

తెలంగాణను తనదైన శైలి ఉద్యమాల ద్వారా ప్రత్యేక రాష్ట్రంగా సాధించిన కేసీఆర్… తొలి పదేళ్ల పాటు రాష్ట్రానికి తానే సీఎంగా వ్యవహరించారు. ఈ కాలంలోనే ఆయన కాళేశ్వరం సహా రాష్ట్రంలో ఎక్కడికక్కడ ప్రాజెక్టులను చేపట్టారు. అయితే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన మూడేళ్లకే కాళేశ్వరం ప్రాజెక్టుకు పగుళ్లు రావడంతో ఈ ప్రాజెక్టు నాణ్యతపై రేవంత్ సర్కారు జస్టిస్ పినాకి చంద్రఘోష్ తో కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిషన్ ఇప్పటిదాకా కేసీఆర్ ను విచారణకు పిలిచిందే లేదు. కేసీఆర్ నే కాకుండా నాడు సాగునీటి మంత్రిగా పనిచేసిన హరీశ్ రావును గానీ, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ ను గానీ విచారించింది లేదు.

లక్ష కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించి నిర్మించిన ఈ ప్రాజెక్టుకు సంబందించిన విచారణలో కేసీఆర్, హరీశ్, ఈటెలలను నేరుగా విచారించకుండా తుది నివేదిక ఎలా ఇస్తారన్న వాదనలు ఇటీవలే వినిపించాయి. అదే సమయంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి కమిషన్ నోటీసులను కేసీఆర్ ఎలా నిర్వీర్యం చేశారన్న విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ రెంటినీ బేరీజు వేసుకుని కేసీఆర్ ను విచారణకు పిలవడం ఎలా అనే ఓ వ్యూహాన్ని నిర్దేశించుకున్నాకే జస్టిస్ ఘోష్ కమిషన్ కాల పరిమితిని పెంచినట్లు సమాచారం. ఈ లెక్కన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ విచారణకు డుమ్మాకొట్టిన కేసీఆర్… జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు కాక తప్పదని, కమిషన్ బోనులో నిలుచుని సమాధానాలు చెప్పక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత, ప్రాజెక్టు వ్యయంపై ఇప్పటీకీ బీఆర్ఎస్, కాంగ్రెస్ సర్కారుల మద్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట కేసీఆర్ కుటుంబం జేబులు నింపుకుందంటూ కాంగ్రెస్ సర్కారు ఆరోపిస్తుంటే… అసలు ప్రాజెక్టుల ప్రాధాన్యత గురించి సరైన అవగాహన లేకుండా ప్రభుత్వం మాట్లాడుతోందని బీఆర్ఎస్ ఎదురు దాడి చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో జూన్ 5న తమ ముందు విచారణకు హాజరు కావాలంటూ కమిషనర్ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో జూన్ 6న హరీశ్ రావు, 9న ఈటెలలు విచారణకు రావాలంటూ వారికీ నోటీసులు జారీ చేసింది. ఈ విచారణకు కేసీఆర్ సహా మిగిలిన ఇద్దరూ హాజరు కాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.