స్కూళ్ళంటేనే తల్లి, దండ్రులు భయపడుతున్నారా ?

సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో పునఃప్రారంభమైన స్కూళ్ళకు తమ పిల్లల్ని పంపాలంటేనే తల్లి, దండ్రులు భయపడుతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే స్కూళ్ళు తెరిచి నాలుగు రోజులు కూడా కాకుండానే వందలమంది టీచర్లకు, విద్యార్ధులకు కరోనా వైరస్ సోకుతోంది. రాష్ట్రం మొత్తం మీద ఇఫ్పటి వరకు సుమారు 900 మంది టీచర్లకు దాదాపు 600 మందికి పైగా విద్యార్ధులకు కరోనా వైరస్ సోకినట్లు వార్తలు వస్తున్నాయి.

స్కూళ్ళు తెరిచిన కారణంగా అందరు ఒకచోట గుమిగూడుతున్న కారణంగా టీచర్లు, పిల్లలకు కరోనా వైరస్ వస్తోందా ? లేకపోతే అప్పటికే కరోనా వైరస్ ఉన్న వారు స్కూళ్ళకు రావటం వల్ల బయటపడుతోందా అన్నది తేలటం లేదు. ఎందుకంటే ప్రతి స్కూల్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే టీచర్లు, విద్యార్ధులందరికీ స్క్రీనింగ్ టెస్టు జరపాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అయితే అన్నీచోట్లా ఆదేశాలు సక్రమంగా అమలు కావటం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి.

గుంటూరు జిల్లాలో జరిపిన వైద్య పరీక్షల్లో దాదాపు 30 మంది టీచర్లకు కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. వీరిలో వైరస్ లక్షణాలు కనబడనప్పటికీ స్క్రీనింగ్ పరీక్షలు జరిపినపుడు జ్వరం లక్షణాలు బయటపడ్డాయి. దాంతో వీళ్ళ బ్లడ్ శాంపిల్సు తీసుకుని పరీక్షలకు పంపినపుడు కరోనా ఉన్నట్లు స్పష్టమైంది. ఇటువంటి టీచర్లు జిల్లాలో ఇంకా ఉన్నట్లు సమాచారం. అలాగే ప్రకాశం జిల్లాలో 20 మంది విద్యార్ధులకు ఏడుగురు టీచర్లకు కరోనా వైరస్ ఉన్నట్లు స్పష్టమైంది.

ఇక కర్నూలు జిల్లాలో సుమారు 40 మంది టీచర్లు, 130 మంది విద్యార్ధులకు కరోనా వైరస్ సోకినట్లు సమాచారం. విశాఖపట్నం జిల్లాలో 50 మంది టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు కరోనా సోకింది. చిత్తూరు జిల్లాలో గడచిన 10 రోజుల్లో 200 మంది టీచర్లు, 20 మంది విద్యార్ధులకు వైరస్ సోకినట్లు పరీక్షల్లో తేలింది. ఇలాగే ఉభయగోదావరి జిల్లాల్లో కూడా టీచర్లు, విద్యార్ధులకు కరోనా వైరస్ సోకిన విషయం ఇపుడు బయటపడుతోంది. దాదాపు అన్నీ జిల్లాల్లోను స్కూళ్ళు తెరవటంతో టీచర్లు, విద్యార్ధుల్లోని కరోనా వైరస్ బయటపడుతోంది.

ఎప్పుడైతే కరోనా వైరస్ బయటపడుతోందో తల్లి, దండ్రుల్లో టెన్షన్ పెరిగిపోతోందట. ఎందుకంటే విద్యార్ధికి కరోనా వైరస్ సోకితే అది మొత్తం కుటుంబానికి సోకే అవకాశం ఉంది. దీంతో స్కూళ్ళు, చదవుల సంగతి దేముడెరుగు ముందు తమ పిల్లల ఆరోగ్యం విషయంలోనే అందరిలోను టెన్షన్ పెరిగిపోతోంది. ఈ విషయంలో ప్రభుత్వం గనుక పునరాలోచించకపోతే ముందు ముందు మరింతమంది టీచర్లు, పిల్లలు కరోనా వైరస్ భారిన పడటం ఖాయమనే అనిపిస్తోంది. మరి ప్రభుత్వం ఏమి చేస్తుందో చూద్దాం.