సైనికులకు అండగా జనసేనాని

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా… సంచలనంగానే నిలుస్తోంది. తాజాగా పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్న వేళ భారత సైన్యంలో పనిచేస్తున్న ఏపీ సైనికులకు బాసటగా నిలిచే దిశగా పవన్ శుక్రవారం ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే సైనికులు, వారి కుటుంబాలకు స్థిరాస్తి పన్ను నుంచి పూర్తిగా మినహాయింపును ఇస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారు. కేవలం నిర్ణయాన్ని ప్రకటించడంతోనే సరిపెట్టని పవన్.. దానికి సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వును కూడా శుక్రవారమే విడుదల చేయించారు.

దేశ సరిహద్దులో తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని, దేశ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైనికులకు ఏంత మేర లబ్ధి చేకూర్చినా తక్కువేనని చెప్పాలి. ఆ మేరకు ఎప్పటికప్పుడు కేంద్రం భారత సైన్యంలో పనిచేస్తున్న సైనికులతో పాటుగా, పనిచేసి ఇప్పటికే రిటైర్ అయిన మాజీ సైనికులకు కూడా ఎన్నో రకాలుగా లబ్ధి చేకూరుతోంది. వారి కుటుంబాల జీవనోపాదికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. యుద్ధంలో వీర మరణం పొందే బారత సైనికుల కుటుంబాలకు ఏ లోటు కూడా రాకుండా చూసుకుంటున్న వైనం మనం చూస్తున్నదే. ఇన్ని రకాలుగా ప్రభుత్వ సాయం అందుతున్న సైనిక కుటుంబాలకు ఇంకేం చేయొచ్చు అన్నదిశగా ఆలోచించిన పవన్…ఆస్తి పన్నులు పూర్తిగా మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

పవన్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ శుక్రవారం రాత్రి విడుదల చేసిన జీవో ఎంఎస్ నెం: 49 ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న సైనిక కుటుంబాలు ఇకపై ఆస్తి పన్నును కట్టాల్సిన అవసరం లేదు. భారత సైనిక కుటుంబాలే కాకుండా…ఇప్పటికే రిటైర్ అయిన సైనికులు, సైనిక వితంతు కుటుంబాలకూ ఈ ఆస్తి పన్ను మినహాయింపును వర్తింపజేయనున్నట్లుగా ఆ ఉత్తర్వుల్లో తెలిపారు. అంతేకాకుండా ఈ ఉత్తర్వులు జారీ అయిన మరుక్షణం నుంచే సైనిక కుటుంబాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు లభిస్తుందని కూడా ఉత్తర్వుల్లో విస్పష్టంగా ప్రకటించడం గమనార్హం. ఇప్పటిదాకా ఈ విషయంలో కొనసాగుతున్న లబ్ధి, ఇకపై అందులో పెరుగుతున్న లబ్ధి గురించిన సమాచారాన్ని కూడా ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.