వైసీపీ నాయకుడు, సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లను, వారి కుటుంబ సభ్యులను తీవ్రంగా దూషించిన కేసులో అరెస్టయి జైలు పాలైన బోరుగడ్డ అనిల్కుమార్కు అనంతపురం జిల్లా కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. అనంతపురం జిల్లాకు చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ను బెదిరించిన కేసులో కూడా బోరుగడ్డపై కేసు నమోదైన విషయం తెలిసిందే. దీనికి కూడా 14 రోజుల చొప్పున ఇప్పటికి నాలుగు సార్లు రిమాండ్ విధించారు.
అయితే.. తాజాగా బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన అనంతపురం కోర్టు.. బోరుగడ్డకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. అయినప్పటికీ.. బోరుగడ్డ జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు. సోషల్ మీడియా కేసులో జైలుపాలైన ఆయన.. రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే.. ఈ క్రమంలో తన తల్లికి ఒంట్లో బాగోలేదని పేర్కొంటూ.. నకిలీ వైద్య పత్రాలను సమర్పించి.. గతంలో బెయిల్ పొందారు. బెయిల్ పొందిన తర్వాత.. పోలీసులకు అనుమానం వచ్చి.. వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్లపై విచారణ చేపట్టగా.. అవి నకిలీవని తేలింది.
దీంతో మరో కేసు నమోదైంది. మరోవైపు.. హైకోర్టు కూడా తమనే తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తారా? అంటూ.. బోరుగడ్డ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. ప్రస్తుతం నకిలీ వైద్య సర్టిఫికెట్లపై మరింత లోతైన విచారణ చేపట్టాలని కూడా పోలీసులను ఆదేశించింది. దీంతో ప్రస్తుతం ఈ కేసు విచారణ పరిదిలో ఉంది. ఫలితంగా అనంతపురం కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసినప్పటికీ.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బోరుగడ్డ విడుదలయ్యే అవకాశం లేదని ఆయన తరఫున వాదనలు వినిపిస్తున్న న్యాయవాదులు చెబుతున్నారు. సో.. ఎప్పటికి మోక్షం లభిస్తుందో అనేది వారికి కూడా అంతుచిక్కడం లేదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates