నిజమే.. బాబులా జగనే చేసి ఉంటే..?

నిజమే… వైసీపీ జమానాలో కొనసాగిన సంక్షేమ పథకాలపై వైరి వర్గాలు చేసిన విమర్శలు ఇప్పుడు నిజమేనేమోనని అనిపించక మానవు. అమ్మ ఒడి నిధులను నాన్నకు బుడ్డితో తిరిగి రాబట్టేశారు కదా అంటూ నాడు విపక్షాలు చేసిన విమర్శ బాగా పేలింది. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.10 వేలు ఇచ్చి.. ట్రాఫిక్ నిబంధనల పేరిట ఆ నిధులనూ లాగేశారనీ విపక్షాలు నాడు ఆరోపించాయి. నాడు కొనసాగిన పరిస్థితులను బట్టి చూస్తే.. ఇవన్నీ ఆరోపణలు కాదు నగ్న సత్యాలని కూడా చెప్పక తప్పదు. ఓ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తే… అది ఏ రీతిన అమలు అవుతుందన్న దానిపై నిఘా ఉంటే కదా.. ఆ పథకాలు అందుకున్న కుటుంబాలు బాగుపడేది? వైైసీపీ జమానాలో ఇంటిలో కూర్చుని బటన్లు నొక్కేసి చేతులు దులుపుకున్న వైనం విస్పష్టంగా కనిపించింది.

మరి ఇప్పుడు కూటమి పాలనలో జరుగుతున్నదేమిటి? పేదలకు ఇస్తున్న సంక్షేమ పథకాలు అమలు అవుతున్న దానిపై ప్రభుత్వం నిఘా ఉంటోంది. అంతేనా… స్వయంగా సీఎం హోదాలో చంద్రబాబు ఆయా వర్గాలతో మమేకం అవుతున్నారు. ఏ వర్గానికి అయితే సంక్షేమ పథకం ఇస్తున్నారో…ఆ వర్గాల వద్దకు చంద్రబాబు వెళుతున్నారు. వారి జీవన విధానం గురించి తెలుసుకుంటున్నారు. వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులపైనా ఆరా తీస్తున్నారు. ఏ మేర సాయం కావాలో అడుగుతున్నారు. ఆ సాయంతో ఎలా అభివృద్ధి సాధిస్తారన్న దానిని లబ్ధిదారుల నోట నుంచే వింటున్నారు. ఆ తర్వాత వారికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారు. స్వయంగా బాబే తమ ఇళ్లకు వచ్చి మరీ ఇస్తున్న సాయాన్ని వృథా చేసేందుకు లబ్ధిదారుల మనసు అంగీకరించడం లేదు. ఫలితంగా పథకాల అమలు పక్కాగా జరుగుతోంది.

శనివారం నాటి చంద్రబాబు టూర్ నే తీసుకుంటే.. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ పరిధిలోని బుడగట్లపాలెం గ్రామాన్ని చంద్రబాబు సందర్శించారు. మత్స్యకార సేవ కింద చేపల వేటపై నిషేధం ఉన్న కాలంలో మత్స్యకారుల జీవనోపాధి కింద వైసీపీ సర్కారు రూ.10 వేలు ఇస్తే… దానిని డబుల్ చేసిన చంద్రబాబు రూ.20 ఇస్తున్నారు. ఈ పథకం ప్రారంభానికి ముందు చంద్రబాబు స్వయంగా సముద్ర తీరంలో మత్స్యకారుల బోట్ల వద్దకు వెళ్లారు. మత్స్యకారులతో స్వయంగా మాట్లాడారు. వారి జీవనం, ఆర్థిక స్థితిగతులపై ఆరా తీశారు. ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయంటూ ఆయన వారినే అడిగారు. వారు చెప్పిన దానిని సావదానంగా విన్న చంద్రబాబు.. ఆ దిశగానే చర్యలు చేపడతామంటూ వారికి భరోసా ఇచ్చారు. ఆ తర్వాతే మత్స్యకార సేవను ఆయన ప్రారంభించారు.

జగన్ కూడా తన హయాంలో పలు సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఆయా వర్గాలకు అండగా నిలిచే దిశగా ఒకింత కృషి చేశారు. అయితే ఏనాడూ ఆయన ఆయా వర్గాలకు చెందిన లబ్ధిదారులతో నేరుగా సమావేశమైందే లేదు. తాను నియమించుకున్న వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులను గుర్తించారు. తన ఆఫీస్ లో కూర్చుని బటన్లు నొక్కారు. అంతే తప్పించి… ఆ నిధులు లబ్ధిదారుల జీవితాలను ఏ రీతిన బాగు చేస్తున్నాయన్న విషయాన్ని మాత్రం జగన్ పట్టించుకున్న పాపాన పోలేదనే చెప్పాలి. ఫలితంగా సంక్షేమ పథకాల ద్వారా అందిన నిధులను ఆయా కుటుంబాలు తమకు ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు చేసుకున్నాయి తప్పించి… సదరు పథకాల ఉద్దేశ్యం మేరకు వెచ్చించ లేదు. ఫలితంగా జగన్ పాలనలో సంక్షేమ పథకాలున్నా లబ్ధిదారులకు ఫలితం దక్కలేదనే చెప్పాలి. అలా కాకుండా బాబు మాదిరిగా జగన్ కూడా జనంతో మమేకం అయి ఉంటే… 2024 ఎన్నికల ఫలితాలు వేరేగా ఉండేవన్న మాట అయితే వినిపిస్తోంది.