ఉగ్రవాదం వేరు ముస్లిం సమాజం వేరు: పవన్

జమ్మూ కశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే. పర్యాటకులుగా కశ్మీర్ లోయలో అడుగుపెట్టిన ఆ 26 మందిని ఉగ్రవాదులు అత్యంత కిరాతకంగా తూటాలతో కాల్చి చంపారు. హిందువులను మాత్రమే ఎంచుకొని ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ముస్లింలను వదిలేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఈ క్రమంలోనే కొన్ని ప్రాంతాల్లో హిందూ, ముస్లిం వర్గాల మధ్య సున్నితమైన వాతావరణం ఏర్పడింది. టెర్రరిస్టులుగా మారిన అతివాద ముస్లింలు చేసిన దుశ్చర్య ప్రభావం మొత్తం ముస్లిం సమాజంపై పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆ తరహా సున్నితమైన చర్చలు, విమర్శలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం వేరు…ఉగ్రవాదులు వేరు..మామూలు ముస్లిం సమాజం వేరు… అని పవన్ కల్యాణ్ అన్నారు. సమాజంలో శాంతియుతంగా ఉండే, శాంతి భద్రతలు కోరుకునే ముస్లిం సమాజం వేరు అని పవన్ అన్నారు. అంతేకాదు, కొందరు ఉగ్రవాదుల చర్యల వల్ల మొత్తం ముస్లిం సమాజాన్ని నిందించడం సరైనది కాదని, ఆ స్పష్టత తమందరికి ఉందని, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉందని పవన్ స్పష్టం చేశారు.

అయితే, ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిందేనని పవన్ చెప్పిన సంగతి తెలిసిందే. చిన్న పిల్లల ముందు తండ్రిని చంపేశారని, శాడిస్టిక్ గా, ఒక పద్ధతి ప్రకారం అమాయకులను ఉగ్రవాదులు చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి దారుణ ఘటనను భారత దేశం ఎప్పటికీ మరిచిపోదని చెప్పారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా నిర్దాక్షిణ్యంగా ఏరేయాలని, మనకు కనికరం ఎక్కువైపోయిందని, మంచితనం ఎక్కువైందని పవన్ అన్నారు.