గత నెల రోజులుగా తీవ్ర సందిగ్ధంలో పడిన గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై కూటమి జెండా ఎగరనుంది. తాజాగా శనివారం ఉదయం 11 గంటలకు జరిగిన అవిశ్వాస ఓటింగ్లో వైసీపీ నాయకురాలు, ప్రస్తుత మేయర్ గొలగాని హరి వెంకట వెంకట కుమారి ఓడిపోయారు. దీంతో కూటమి పార్టీలు పైచేయి సాధించారు. మొత్తం 98 మంది కార్పొరేటర్లు విశాఖలో ఉన్నారు. వీరిలో ఒకరు ఎప్పుడో దూరంగా ఉన్నారు. దీంతో ఓటింగ్ 97 మందికి జరిగింది.
అయితే.. అవిశ్వాస ఓటింగ్ విషయానికి వచ్చేసరికి.. కూటమి పైచేయి సాధించింది. ఆది నుంచి కూడా. కూటమికి అనుకూలంగా కార్పొరేటర్లను దరిచేరుకున్నారు. టీడీపీ, జనసేన నాయకులు ఈ విషయంలో చక్రం తిప్పారు. దీంతో ప్రత్యేకంగా భీమిలిలో శిబిరాలు ఏర్పాటు చేసి.. కట్టుతప్పకుండా చూసుకున్నారు. వైసీపీ నుంచి వచ్చే వారికి ఆహ్వానం పలికారు. ఫలితంగా.. ఆది 78 మంది కార్పొరేటర్లతో కళకళలాడిన విశాఖ వైసీపీ.. చివరకు 25 మందికి పరిమితమైంది.
తాజాగా మేయర్పై అవిశ్వాసం ప్రకటించిన నేపథ్యంలో వైసీపీ తన కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. అయినా.. ఎవరూ పట్టించుకోలేదు. మరోవైపు.. వైసీపీకి మద్దతుగా ఉన్న పాతిక మంది కూడా.. కీలకమైన ఓటింగ్ సమయంలో కౌన్సిల్ మొహం చూడలేదు. దీంతో 74 మంది కార్పొరేటర్లే హాజరయ్యారు. కలెక్టర్ హరీందర్కుమార్ ఓటింగ్ నిర్వహించారు. మేయర్పై అవిశ్వాసంప్రకటిస్తూ.. 74 మంది చేతులు ఎత్తి తమ సమ్మతిని తెలిపారు. దీంతో ఆమెను పదవి నుంచి తప్పిస్తున్నట్టు కలెక్టర్ ప్రకటించారు.
దీనికి సంబంధించిన తీర్మాన ప్రతిని ఆయన విడుదల చేయనున్నారు. అనంతరం.. విశాఖ గ్రేటర్ ముని సిపాలిటీ.. కూటమి పార్టీలు దక్కించుకున్నట్టు అయింది. ఇక, ఎందుకిలా జరిగిందన్న సందేహం కూడా ఉంటుంది. విశాఖలో ఏ పనులు చేయాలన్నా.. పరిశ్రమలకు భూములు కేటాయించాలన్నా.. కార్పొరేషన్ అనుమతి కూడా అవసరం. అయితే..కూటమి చేపట్టే కార్యక్రమాలకు వైసీపీ నాయకులు అడ్డు పడుతున్న నేపథ్యంలో మేయర్పై అవిశ్వాసంప్రకటించారు. ఇది సక్సెస్ కావడంతో విశాఖలో ఇక ఇబ్బందులు లేకుండా .. పనులుచేసుకునే అవకాశం దక్కింది. కొత్త మేయర్ ఎవరనేది కూటమి పార్టీలు నిర్ణయించుకోనున్నాయి.