కాశ్మీర్ పై పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ కౌంటర్

పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ మరోసారి కశ్మీర్ విషయాన్ని లేవనెత్తుతూ, దానిపై తమ వైఖరి ఎలాంటి మార్పులేని దృక్పథాన్ని ప్రకటించారు. ఇస్లామాబాద్‌లో జరిగిన ఓవర్సీస్ పాకిస్థానీయుల కన్వెన్షన్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్తవేమీ కాకపోయినా, మళ్లీ అదే రాగం పాడుతుండటమే పెద్దగా చర్చనీయాంశంగా మారింది. కశ్మీర్ తమకు జీవనాడి వంటిదని, దాన్ని మరచిపోమని మునీర్ స్పష్టం చేశారు.

అంతర్జాతీయ వేదికలపై పాక్ యొక్క వ్యాఖ్యలకు పెద్దగా స్పందన లేకపోయినా, మునీర్ మాత్రం మరోసారి దేశీయ వేదికపై ఈ అంశాన్ని జోరుగా లేపారు. “కశ్మీర్ సోదరులను వదిలేశాము అనే ఆలోచనే లేదు” అంటూ ఆయన బలమైన వ్యాఖ్యలు చేశారు. ఇందులో భారత్‌ను ప్రత్యక్షంగా టార్గెట్ చేయకపోయినా, పరోక్షంగా మాత్రం తమ మొండి వైఖరిని బలపరుస్తూ వ్యాఖ్యానించారు. ఈ మేరకు తమ విధానంలో ఎలాంటి వెనుకడుగు లేదన్న సంకేతాలే ఇచ్చారు.

పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలకు భారత్ తీవ్రంగా స్పందించింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భూభాగాన్ని ఖాళీ చేయడమే కశ్మీర్‌పై దాయాదికి ఉన్న ఏకైక సంబంధమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. కశ్మీర్‌ భారత భూభాగమని, విదేశీ భూమిని జీవనాడిగా ఎలా పరిగణిస్తారని ఆయన ప్రశ్నించారు. ఐరాస వేదికగా భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ కూడా పాక్‌కి గట్టి హెచ్చరికలు జారీ చేశారు. జమ్మూ కశ్మీర్‌ భారత్‌ లోనే అంతర్భాగమని, పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందేనని చెప్పారు.

ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా పీఓకే లేకుండా జమ్మూకశ్మీర్ అసంపూర్ణమని వ్యాఖ్యానించారు. పాక్ ఆ ప్రాంతాన్ని ఉగ్రవాద శిక్షణ కేంద్రంగా ఉపయోగిస్తోందని ఆరోపించారు. ముంబయి దాడుల్లో పాత్ర వహించిన తహవ్వుర్ రాణాను పాక్ ఇప్పటికీ రక్షిస్తోందని జైస్వాల్ మండిపడ్డారు. అలాగే ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీ అరెస్ట్ అయ్యాడని, అతడిని భారత్‌కు తీసుకురావడంపై బెల్జియం ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నామని వెల్లడించారు.