శ్రీవారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌తీమ‌ణి, ఇటాలియ‌న్ అన్నాలెజెనోవో తిరుమ‌ల సంప్ర‌దాయాల‌కు పెద్ద‌పీట వేశారు. విదేశాల‌కు చెందిన వారు, ఇత‌ర మ‌తాల‌ను ఆచ‌రించేవారు.. తిరుమ‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు ఎలాంటి సంప్ర‌దాయాలు పాటించాలో ఖ‌చ్చితంగా వాటిని ఆమె పాటించారు. కుమారుడు మార్క్ శంక‌ర్ ఇటీవ‌ల సింగ‌పూర్లో జ‌రిగిన అగ్రిప్ర‌మాదంలో గాయ‌ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో శ్రీవారికి మొక్కుకున్న అన్నా లెజెనోవా.. మార్క్ శంక‌ర్ కోలుకోవ‌డంతోపాటు.. సుర‌క్షితంగా ఇంటికి రావ‌డంతో మొక్కులు తీర్చుకునేందుకు తిరుమ‌ల‌కు వ‌చ్చారు.

ఈ క్ర‌మంలో తొలుత తిరుప‌తిలోనే ఆమె డిక్ల‌రేష‌న్‌(శ్రీవారిని విశ్వ‌సిస్తున్నాను. ఆయ‌న‌పై న‌మ్మ‌కం ఉంది అని పేర్కొంటూ.. చేసే సంత‌కం. గ‌తంలో జ‌గ‌న్ ఈ విష‌యంలోనే ఇరుకుప‌డ్డారు) పై సంత‌కం చేశారు. అనంత‌రం.. నేరుగా ఆమె తిరుమ‌ల‌కు వెళ్లి శ్రీవారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. తొలుత గాయ‌త్రి నిల‌యం అతిథి గృహానికి చేరుకున్న ఆమెకు..ప్రొటోకాల్ ప్ర‌కారం.. అధికారులు స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం.. ఆమె కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంత‌రం.. భూవ‌రాహ‌స్వామిని ద‌ర్శించుకున్నారు. అక్క‌డ ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

ఆ త‌ర్వాత క‌ల్యాణ క‌ట్ట‌కు వెళ్లి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. ఆదివారం రాత్రికి తిరుమ‌ల‌లోనే బ‌స చేయ‌నున్న అన్నా లెజెనోవా.. సోమ‌వారం ఉద‌యం శ్రీవారి సుప్ర‌భాత సేవ‌లో పాల్గొంటారు. అనంత‌రం.. త‌రిగొండ వెంగ‌మాంబ స‌త్రంలో భోజ‌నాల‌ను వ‌డ్డించ‌నున్నారు. అక్క‌డే ఆమె కూడా భోజ‌నం చేయ‌నున్నారు. మొక్కు చెల్లించుకోవ‌డంలో భాగంగానే అన్నా లెజెనోవా.. తిరుమ‌ల‌కు వ‌చ్చార‌ని జ‌న‌సేన పార్టీ తెలిపింది. కాగా.. ఆమె ప‌ర్య‌ట‌న‌లో జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఎవ‌రూ పాల్గొన‌రాద‌ని.. పార్టీ నిర్దేశించ‌డంతో ఆమె వెంట‌ కొంద‌రు అధికారులు మాత్ర‌మే ఉన్నారు.