వదినమ్మకు మద్దతు.. అన్నయ్యకు చీవాట్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై ఐటీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టు చేబ్రోలు కిరణ్ కుమార్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా ఖండించారు. భారతి రెడ్దిపై సదరు వ్యాఖ్యలు చాలా బాధాకరమన్న షర్మిల… ఇలాంటి నీచపు కామెంట్లు తీవ్రవాదంతో సమానమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ విష సంస్కృతికి బీజం వేసింది మాత్రం తన సోదరుడు జగన్ నేతృత్వంలోని వైసీపీతో పాటు ప్రస్తుత సీఎం నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలోని టీడీపీనేనని ఆమె ఆరోపించారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారిని కాలకేయులతో పోల్చిన షర్మిల… వారిని తయారు చేసింది మాత్రం వైసీపీ, టీడీపీలేనని మండిపడ్డారు. వెరసి తన వదినమ్మపై అసభ్య వ్యాఖ్యలను ఖండించిన షర్మిల… అందుకు బీజం వేసింది మాత్రం తన అన్న జగనేనని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసే వారిని, పోస్టులు పెట్టేవారిని సైకో గాళ్లుగా అభివర్ణించిన షర్మిల… వారిని నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేదని వ్యాఖ్యానించారు. తప్పుడు కూతలు కూసే వెధవలను… తమ రేటింగ్స్ కోసం వారిని ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానెళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఆ తరహా చర్యల కోసం చట్టాలు ఉండాల్సిందేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ తరహా మకిలీ చేష్టలను సభ్య సమాజం హర్షిందని ఆమె అన్నారు. ఈ తరహా ఘటనల్లో నిందితులు ఏ పార్టీకి చెందిన వారైనా, ఎంతటి వారైనా కూడా శిక్ష పడాల్సిందేనని, ఆ దిశగా కూటమి సర్కారు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ విషయంలో కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలు ఏమాత్రం పక్షపాత ధోరణితో వ్యవహరించరాదని ఆమె కోరారు. కఠిన చర్యలే ఈ తరహా దుశ్చర్యలకు ఫుల్ స్టాప్ పెడతాయని ఆమె అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచపు వ్యవస్థ ఒక్క ఏపీలోనే ఉందని కూడా షర్మిల ఆరోపించారు. వైసీపీ, టీడీపీల కారణంగానే ఈ విష సంస్కృతికి బీజం పడిందన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఉచ్ఛం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారని ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలో రక్త సంబంధాలను మరిచారని, రాజకీయ కక్షతో కటుంబాలను రోడ్డు మీదకు లాగారని కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి పుట్టుకను కూడా అనుమానించి రాక్షసానందం పొందారని దుయ్యబట్టారు. చివరకు అభంశుభం తెలియని పసి పిల్లలను కూడా బయటకు లాగారని ధ్వజమెత్తారు. అక్రమ సంబంధాలను అంటగట్టారని మండిపడ్డదారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించారని ఆరోపించారు. ఈ దారుణ సంస్కృతిని వెలి వేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు. వెరసి ఈ వ్యవహారంలో తన వదినమ్మకు మద్దతు పలికిన షర్మిల… తన వదినమ్మపై ఈ తరహా అసభ్యకర పోస్టులు పెట్టడానికి తన అన్నే కారణమని తేల్చి చెప్పినట్టైంది.